
హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు
గద్వాల క్రైం: నా భర్తను ఓ ట్రాన్స్జెండర్, మరికొందరు కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వెంటనే దోషులను పట్టుకొని శిక్షించాలంటూ మృతుడి భార్య కృష్ణవేణి ఆందోళనకు దిగింది. మల్దకల్ మండలానికి చెందిన కుర్వ రామక్రిష్ణ (24) శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే శనివారం ఉదయం అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మృతుడి భార్య, వారి కుటుంబ సభ్యులు పోస్టుమార్టం కంటే ముందు హత్య చేసిన ట్రాన్స్జెండర్ శ్రీవాణితో పాటు మరి కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజేప్పేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలోనే మృతుడి భార్య కృష్ణవేణి, తన చిన్నారితో కలిసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడతానని పెట్రోల్ బాటిల్ తీసుకురావడంతో పోలీసులు ఖంగుతిన్నారు. వెంటనే వారించి పెట్రోల్ బాటిల్ను లాక్కున్నారు. ఆ వెంటనే చిన్నారితో కలిసి సదరు మహిళ ఆసుపత్రి బయటికి పరుగులు తీసి రోడ్డుపై వెళ్తున్న బస్సు కింద పడేందుకు ప్రయత్నం చేసింది. గుర్తించిన బస్సు డ్రైవర్ క్షణాల్లో బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది.
ఉద్రిక్త వాతావరణం
దీంతో కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేయగా పోలీసుల తీరుపై మండిపడ్డారు. న్యాయం కోసం నిరసన వ్యక్తం చేస్తున్న తమపై ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీను అక్కడికి చేరుకొని ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని బాధిత కుటుంబసభ్యులను శాంతింపజేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేకురుస్తామని భరోసా కల్పించారు. వారిని పట్టుకునేందుకు ఇప్పటికే పలు బృందాలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు పంపించామని, సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించే పని లో ఉన్నామన్నారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
దోషులను శిక్షించాలని మృతుడి భార్య ఆందోళన
చిన్నారితో కలిసి పెట్రోల్ పోసుకొని.. బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నం
జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం

హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు