
అంజన్న జయంతి.. భక్తజన సందడి
గద్వాలటౌన్: శ్రీరాముడికి అత్యంత ప్రీతిపాత్రుడైన హనుమంతుడి జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో చేపట్టిన వీర హనుమాన్ శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు ధరూర్, బీచుపల్లి, చింతరేవుల, మల్దకల్, అయిజ, అలంపూర్, శాంతినగర్, బిజ్వారం తదితర ప్రాంతాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజులు నిర్వహించారు. మండల కేంద్రాలలో భారీ ఊరేగింపులు నిర్వహించారు. జయంతి సందర్భంగా దీక్షా పరులు అర్థరాత్రి నుంచే హనుమాన్ భజనలు, పాటలుతో హోరెత్తించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మార్మోగిన నామస్మరణం
జిల్లా కేంద్రంలో చేపట్టిన వీర హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భజరంగ్దళ్, విశ్వహిందు పరిషత్, దర్మ ప్రసార సమితి నాయకులతో పాటు వివేకానంద సేవాదళ్, హనుమాన్ దీక్షపరులతో గద్వాల పట్టణం కాషాయరంగును సంతరించుకుంది. ‘రామలక్ష్మణ జానకి.. జై భోలో హనుమాన్కీ’ అని కీర్తిస్తూ, పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, బీజేపీ నాయకులు అయ్యప్పురెడ్డి, డీకే స్నిగ్దారెడ్డి తదితరులు హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్నారు. డీఎస్పీ మొగలయ్య హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.
శోభాయమానంగా హనుమాన్ శోభయాత్ర