
పల్లె వనం.. కళావిహీనం
మొక్కలను కాపాడతాం
పల్లె ప్రకృతి వనాలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటాం. నీటి సాదుపాయం అందించేలా చూస్తాం. మొక్కలు ఎండకుండా కాపాడతాం. – నాగేంద్రం, జిల్లా పంచాయతీ అధికారి
నిర్వహణ ముఖ్యం
ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడమే పల్లె ప్రకృతి వనాల ముఖ్య ఉద్దేశం. నిర్వహణ లేకనే లక్ష్యం నీరుగారుతోంది. అధికారులు స్పందించి మొక్కలు ఎండకుండా ప్రతి రోజు నీరందించాలి. గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచాలి. వాకింగ్ ట్రాక్లు ఏర్పాటుచేయాలి.
– విజయ్కుమార్,
మాజీ సర్పంచ్, బోరవెల్లి
● నీటి సౌకర్యం లేక
వాడుతున్న మొక్కలు
● ఆహ్లాదానికి దూరమవుతున్న ప్రజలు
● మందుబాబులకు అడ్డాగా
మారుతున్న వైనం
●
మానవపాడు: పల్లె ప్రజలకు ప్రకృతి అందాలు పంచేందుకు దాదాపు రూ.లక్షలు వెచ్చించి పెంచిన పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ లేక వృథాగా మారాయి. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని.. ఎన్నో ఔషధ మొక్కలకు నెలవుగా మారాలని.. పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన పల్లె ప్రకృతి వనాలు అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మొక్కలు ఎండిపోయి.. మందుబాబులకు అడ్డాగా మారాయి. మొత్తంగా పల్లె ప్రకృతి వనాలు కళతప్పాయి. జిల్లాలోని 13 మండలాల్లో 254 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కో పల్లెప్రకృతివనం నిర్మించారు. రెండేళ్ల పాటు ఈజీఎస్, ఆ తర్వాత జీపీలు నిర్వహణ బాధ్యతలు చూశాయి. అయితే, గ్రామాలకు దూరంగా ఉండటం, కొన్ని గ్రామాల్లో నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, నీటి సౌకర్యం లేకపోవడం.. వీటికి తోడు వేసవి ఎండలకు మొక్కలు ఎండిపోతున్నాయి. ఊరికి దూరంగా ఉండడంతో రాత్రివేళ్లలో మద్యం బాబులు అడ్డాలుగా వాడుకుంటున్నారు.