అనామలీస్
ఓటర్లు
భూపాలపల్లి: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ కార్యక్రమం తొలి ఘట్టం సోమవారం రాత్రితో ముగిసింది. వివిధ కారణాలతో ఎన్యూమరేషన్ ఫారాలు అందించని వారు, పేర్లలో తప్పులు దొర్లిన, డేటా లభించని వారు భారీ సంఖ్యలో ఉన్నారు. దీంతో వారందరికి నోటీసులు ఇచ్చేందుకు ఎన్నికల విభాగం అధికారులు సిద్ధమవుతున్నారు. ఎవరూ ఊహించని రీతిలో భూపాలపల్లి నియోజకవర్గంలో పలు కారణాలతో సుమారు 75వేల మందికి నోటీసులు అందనున్నట్లు తెలుస్తోంది.
35,918 ఓట్లు తొలగించుడేనా?
నియోజకవర్గంలోని 12 మండలాల్లో మ్యాపింగ్ చేయని, మృతిచెందిన, పర్మనెంట్గా ఇతర ప్రాంతాలకు వెళ్లిన, రెండు ప్రాంతాల్లో ఓట్లు కలిగిన, సమాచారం ఇవ్వనివారు 35,918 మంది ఓటర్లు ఉన్నారు. వీరిందరికీ త్వరలోనే నోటీసులు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి ఇవ్వనందున, ఓట్లు తొలగించే అవకాశాలే కనిపిస్తున్నాయి.
పేర్లలో తప్పులు దొర్లిన ఓటర్లు భారీగా..
నియోజకవర్గంలో పేర్లలో తప్పులు దొర్లిన ఓటర్లు(అనామలీస్) సైతం భారీగా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుంది. దీంతో ఆ సమయంలో ఇంటి పేరు ముందు ఉండి, పేరు తరువాత ఉన్న ఓటరు.. ప్రస్తుతం ఓటరు పేరు ముందు ఉండి, ఇంటి పేరు తరువాత ఉన్న వారు, సింగరేణి సంస్థలో మారుపేర్లు ఉన్న వారు ఉన్నారు. రెవెన్యూ అధికారులు వీరందరినీ అనామలీస్ జాబితాలో చేర్చారు. ఈ జాబితాలో భూపాలపల్లి నియోజకవర్గంలో 20,872(7.51 శాతం) మంది ఉన్నారు. వీరిందరికి సైతం రెవెన్యూ అధికారులు నోటీసులు అందించనున్నారు. సరైన పత్రాలు సమర్పించని వారి ఓట్లు సైతం తొలగిపోనున్నాయి.
డేటా దొరకని వారెందరో..
2002 జాబితాలో పేర్లు లేకపోవడంతో తల్లితండ్రుల ఓటరు గుర్తింపు కార్డు నంబరు ఆధారంగా వేలాది మంది ‘సర్’ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారు. తల్లి పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబరు రాసిన వారందరివి ఓకే అవుతుండగా తండ్రి వివరాలు నమోదు చేసిన వారివి పెండింగ్లో ఉంటున్నట్లు తెలుస్తుంది. దీంతో వారందరికి సైతం నోటీసులు జారీ చేసేందుకు అధికాారులు సన్నద్ధం అవుతున్నారు.
75వేలలో ఉండేవి ఎన్నో.. ఊడేవి ఎన్నో..
మృతి చెందిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన, సమాచారం ఇవ్వని, డేటా లభించని, పేర్పు తప్పులు దొర్లినవారు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 75వేల వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వీరందరికీ ఎన్నికల విభాగం అధికారులు నోటీసులు జారీచేసేందుకు సిద్ధమవుతున్నారు.
అత్యధికం కనిపర్తిలో.. అత్యల్పం అర్బన్లో..
జిల్లాలోని 12 మండలాల్లో అత్యధికంగా రేగొండ మండలం కనిపర్తి గ్రామంలోని 249వ పోలింగ్ బూత్లో 1,262 ఓట్లకు గాను 1,251 మంది ఓట్లు(99.13 శాతం) డిజిటలైజేషన్ అయ్యాయి. తరువాత స్థానంలో అదే మండలంలోని రేపాకపల్లి 233వ బూత్లో 98.76 శాతం జరిగింది. ఇదిలా ఉండగా అత్యల్పంగా భూపాలపల్లి అర్బన్లోని 21 పోలింగ్ బూత్లో కేవలం 45.99 శాతం మాత్రమే ఓట్లు డిజిటలైజేషన్ అయ్యాయి.
నియోజకవర్గంలో అనామలీస్ ఓటర్లు 20,872
మృతిచెందిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిన,
సమాచారం ఇవ్వని వారు 35,918
డేటా దొరకని వారు వేలల్లో..
నోటీసులు ఇచ్చేందుకు
సిద్ధమవుతున్న అధికారులు
మొత్తం ఓటర్లు 2,77882
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 2,77882
డిజిటలైజేషన్ చేసినవి 2,41,964
డిజిటలైజేషన్ పూర్తయిన శాతం 87.07
గుర్తించిన మృతుల ఓట్లు 22,703
డబుల్ ఓట్లు 3,173
సమాచారం ఇవ్వనివారు 3,785
డిజిటలైజేషన్ చేయని మొత్తం ఓట్లు 35,918
పేర్లలో తప్పులు దొర్లినవారు 20,872


