● డీఈఓ రాజేందర్
కాళేశ్వరం: విద్యార్థుల అభ్యసన స్థాయి మెరుగుదలకు ఉపాధ్యాయులు కృషిచేయాలని డీఈఓ ముద్దమల్ల రాజేందర్ అన్నారు. మంగళవారం ఆయన మహదేవపూర్ మండలం కాళేశ్వరం పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్, పీటీఏ సమావేశాల నిర్వహణ, గత విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ రాజేందర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 95 నుంచి 136కు పెరగడం పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ఇది పాఠశాలపై తల్లిదండ్రులు, స్థానిక ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య పెరగడం ఒక మంచి పరిణామమని, అదే సమయంలో వారికి నాణ్యమైన విద్యను అందించడం ఉపాధ్యాయులపై మరింత బాధ్యతను పెంచుతుందని అన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు అనేక రకాల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. శిక్షణ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు నేర్చుకున్న ప్రతీ అంశాన్ని తరగతి గదిలో సమర్థవంతంగా అమలుచేసి, దాని ప్రయోజనాలను విద్యార్థులకు అందేలా కృషిచేయాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొనికల రాజేందర్ పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల ప్రగతి తదితర అంశాలను జిల్లా విద్యాశాఖ అధికారికి వివరించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ఉన్నారు.


