● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి
రేగొండ: చలివాగు నుంచి సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చెన్నాపూర్ క్రాస్ వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలివాగు ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసి ఆయకట్టు ప్రాంత భూముల సాగుకు సహకరించాలన్నారు. రైతులు నార్లుపోసి 45 రోజులు గడుస్తున్నా నీళ్లు లేకపోవడంతో నాట్లు ప్రారంభించలేదన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద తొమ్మిది పంప్లను ఆన్చేసి, చలివాగు ప్రాజెక్ట్ను నింపి నీటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా విమర్శించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కరువని ఎద్దేవా చేశారు. 24 గంటల్లోగా నీటిని విడుదల చేయకపోతే మళ్లీ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం శాయంపేట మండలంలోని చలివాగు ప్రాజెక్ట్, పంప్ హౌస్ను నాయకులతో కలిసి సందర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు, పాల్గొన్నారు.


