సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఉమ్మడి వరంగల్లో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. శనివారంనుంచి సోమవారం వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్తోపాటు ఉమ్మడి వరంగల్లోని జిల్లాల పోలీస్ అధికారులతో ఆయన వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. తెలంగాణ పోలీసింగ్లో కొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్న ఆయన జిల్లాల వారీగా శాంతిభద్రతలు, నేర నియంత్రణ, పెండింగ్ కేసులు, దర్యాప్తు తీరుతెన్నులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించి తగు సూచనలు చేయనున్నారని తెలిసింది. మొదట ఈ పర్యటన జూలై 30, 31 తేదీల్లో ఉన్నట్లు ప్రకటించినప్పటికీ వర్షాల కారణంగా వాయిదా పడింది. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీవీ ఆనంద్ మొదటి సారి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో శనివారం నుంచి పర్యటిస్తున్నారు.
మూడు రోజులు.. మూడు దశల్లో సమీక్షలు
శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న డీజీపీ సీవీ ఆనంద్ నేరుగా మామునూరు బెటాలియన్కు చేరుకుంటారని తెలిసింది. అక్కడ వివిధ స్థాయిల అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం హనుమకొండ సిటీకి చేరుకుని నక్కలగుట్టలోని హరిత కాకతీయలో రాత్రి బస చేయనున్నట్లు సమాచారం. 9న ఉదయం వరంగల్ కమిషనరేట్ కార్యాలయం సందర్శన అనంతరం సీపీ, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం వరంగల్ నుంచి బయలుదేరి ములుగు జిల్లాకు వెళ్తారని సమాచారం. సమీక్షలో భాగంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో సమావేశం కానుండగా, ఆయా జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పోలీసింగ్ పనితీరుపై వివరాలు అందించనున్నారని తెలిసింది.
నేటినుంచి మూడు రోజులపాటు వరుస సమీక్షలు
ఎస్పీలు, పోలీస్ అధికారులతో నేరుగా భేటీ
నేర నియంత్రణ, సాంకేతికతలపై ఫోకస్
డీజీపీగా జిల్లాకు తొలిసారి వస్తున్న సీవీ ఆనంద్


