● కలెక్టర్ రాహుల్శర్మ
భూపాలపల్లి అర్బన్: వైద్య కళాశాల బాలికల వసతి గృహ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి, ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ రాహుల్శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన బాలికల వైద్య కళాశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. వర్షాల కారణంగా పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, భవనం అంతర్గత (ఇంటీరియర్) పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సమయం తక్కువగా ఉన్నందున పనుల్లో వేగం పెంచి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరు నాటికి బాలికల వసతి భవనాన్ని పూర్తిస్థాయిలో అప్పగించాలని స్పష్టం చేశారు. బాలుర వసతి భవన నిర్మాణ పనుల్లో జాప్యం వహించవద్దని, దానిని సెప్టెంబర్ నెలాఖరు నాటికి సిద్ధంచేసి అందించాలని ఆదేశించారు. హాస్టల్ భవనంలో విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఎంతమేర విద్యుత్ అవసరమవుతుందో అంచనా వేసి, సమగ్ర నివేదికలు అందించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం, ఆర్అండ్బీ ఈఈ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.


