నాలుగు పనులు.. రూ.197 కోట్లు
సాక్షిప్రతినిధి, వరంగల్ : రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలకు చెక్ పడనుంది. ఉమ్మడి వరంగల్లో నాలుగు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ), రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణాలకు కేంద్ర రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. వీటి కోసం ఏకంగా రూ.197 కోట్లను కేటాయించింది. ఇప్పటికే ఒకచోట టెండర్ ఖరారుకాగా.. మరోచోట డిజైన్లు, అంచనాల రూపకల్పన జరుగుతోంది. ఇంకోచోట రైల్వే వాటా పనులు పూర్తికాగా.. అప్రోచ్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులతో ఒక ఆర్యూబీ పనులు మాత్రం నిలిచిపోయాయి. పెండింగ్ పనులపైన దృష్టి సారించనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు.
రాష్ట్రంనుంచి మరో మూడు..
కేంద్ర రైల్వేశాఖ చేపట్టిన నాలుగు పనులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మరో మూడు ఆర్వోబీల నిర్మాణం జరుగుతోంది. కాజీపేట–వరంగల్ మార్గంలోని ఎల్సీ నంబర్ 60, ఎల్గుర్–నెక్కొండ మార్గంలోని ఎల్సీ నంబర్ 66, 67 వద్ద వీటిని నిర్మిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రైల్వే క్రాసింగ్ల సమస్యకు గణనీయంగా పరిష్కారం లభించే అవకాశం ఉంది.
రాకపోకల అంతరాయానికి చెక్..
రాష్ట్రంలో మరో 118 ఆర్వోబీ, ఆర్యూబీ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాటి అంచనా వ్యయం సుమారు రూ.4,883 కోట్లుగా స్పష్టం చేసిన రైల్వేశాఖ.. ఇందులోనే మూడు ఆర్వోబీలు, ఏడు ఆర్యూబీలు, ఎనిమిది లెవల్ క్రాసింగ్లు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నట్లు వివరించింది. క్రాసింగ్ల వద్ద రైళ్ల రాకపోకల సమయంలో వాహనాలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండటంతో.. వీటి స్థానంలో వంతెనల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణంలో భూసేకరణ, వివిధ శాఖల అనుమతులు, వాతావరణ పరిస్థితుల వల్ల జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. పనులను వేగవంతం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తూ, ఆమోదంలో జాప్యం లేకుండా ప్రామాణిక డ్రాయింగ్లను సిద్ధం చేస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం.
నాలుగు లెవల్ క్రాసింగ్ల వద్ద చేపట్టనున్న పనుల అంచనా వ్యయం రూ.197 కోట్లు కాగా, ఆ మేరకు నిధులు కేటాయించారు. ఈ నాలుగు పనుల్లో ఒక్కదానికి టెండర్ సైతం ఖరారు చేశారు. మిగతా పనులు వివిధ స్థాయిల్లో ఉన్నా యి. పనులు, నిధుల వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్–చింతలపల్లి మార్గంలోని ఎల్సీ నంబర్ 64 వద్ద ఆర్వోబీ నిర్మాణానికి రూ.77 కోట్లు అంచనా వేశారు. టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.
ఎల్గూర్–నెక్కొండ మార్గంలోని ఎల్సీ నంబర్ 69/ఎం వద్ద రూ.100 కోట్లతో ఆర్వోబీ నిర్మించనున్నారు. ప్రస్తుతం జనరల్ అరేంజ్మెంట్ డ్రాయింగ్ (జీఏడీ), అంచనాల తయారీ పనులు జరుగుతున్నాయి.
ఎల్గూర్–నెక్కొండ మార్గంలోని ఎల్సీ నంబర్ 70 వద్ద రూ.12 కోట్లతో చేపట్టిన ఆర్యూబీ పనుల్లో రైల్వేవాటా పూర్తయింది. అప్రోచ్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి.
నెక్కొండ–ఇంటికన్నె మార్గంలోని ఎల్సీ నంబర్ 74 వద్ద రూ.8 కోట్లతో చేపట్టాల్సిన ఆర్యూబీ పనులు కోర్టు ఉత్తర్వుల కారణంగా ప్రస్తుతం నిలిచిపోయాయి.
ఉమ్మడి జిల్లాలో నాలుగుచోట్ల
ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణం
వరంగల్లో రైల్వే వంతెనలకు
రూ.197 కోట్లు ప్రకటించిన
కేంద్ర ప్రభుత్వం


