భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో వాక్ ఇన్ ప్రవేశాలు కల్పించనున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, కన్వీనర్ జుమ్లానాయక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అపరాధ రుసుం లేకుండా వాక్ ఇన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సూపరింటెండెంట్గా డాక్టర్ వెంకటరత్నం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ చెనుమల్ల వెంకటరత్నం నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన డాక్టర్ రాజేంద్రప్రసాద్ స్థానంలో ఈఎన్టీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటరత్నంను నియమిస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేశారు. బుధవారం ఇయన బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
ఎంపిక
మల్హర్: మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. బాలికల విభాగంలో కొడారి హిమజ అండర్–16 (జావెలిన్ త్రో), ఎల్లిపాయల శృతి అండర్ 18 (షాట్ ఫుట్), భూతం సాయి వర్షిని అండర్–14 కిడ్స్ (జావెలిన్), గాలి వర్షిత అండర్–12 (రన్నింగ్) విభాగాల్లో ఎంపికయ్యారు. బాలుర విభాగంలో అజ్మీర రాంచరణ్ (అండర్– 18) షార్ట్ ఫుట్, వేముల అభిరాం అండర్–18 రన్నింగ్, కుదురుపాక అండర్–18 రన్నింగ్ విభాగంలో ఎన్నికయ్యారు. ఈ నెల 7, 8 తేదీల్లో హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
జిల్లా కమిటీ ఎన్నిక
ములుగు రూరల్: పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గడ్డం క్రాంతి కుమార్(కానిస్టేబుల్), ఉపాధ్యక్షులుగా తాజుద్దీన్(ఎస్సై), కృష్ణప్రసాద్(ఎస్సై), కార్యదర్శిగా సురేశ్(సీఐ), జాయింట్ సెక్రటరీగా నరేశ్(హెడ్ కానిస్టేబుల్), ఆర్గనైజింగ్ సెక్రటరీగా విజయ్(హెడ్ కానిస్టేబుల్), ట్రెజరర్గా సర్వేశ్వర్రావు(కానిస్టేబుల్), ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా అనిల్కుమార్, రాజీవ్, స్వప్న యాదవ్, శోభన్, తిరుపతి, శంకర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు కమిటీ సభ్యులు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నిజాయతీగా , పారదర్శకంగా పని చేయాలని సూచించారు. పోలీస్ అధికారుల సంక్షేమం, పరస్పర సహకారంతో అసోసియేషన్ పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల
పరిష్కారానికే మండలసభ
వెంకటాపురం(ఎం): మండల పరిధిలో నిర్వహించే సభ ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి దిక్సూచిలా, నిజమైన ప్రజా వేదికగా మారాలని అదనపు కలెక్టర్ సంపత్ రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ పంచాయతీలు సమగ్రాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. స్థానికంగా ఉన్న మౌలిక వసతుల కొరతతో పాటు ప్రజల నుంచి వస్తున్న వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలను ఈ నెల 15వ తేదీ లోపు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రతీ 45 రోజులకు ఒకసారి తప్పనిసరిగా మండల సభను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సభలకు మండల స్థాయి అధికారులు నేరుగా హాజరుకావాలని, తమకు బదులుగా కింది స్థాయి సిబ్బందిని లేదా ప్రతినిధులను పంపితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తెచ్చే సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు.


