గణపురం: నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కతూ పెరిగిపోతున్నాయని.. ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. గణపురం మండలంలోని చెల్పూరు కాకతీయ థర్మల్ విద్యుత్కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సురక్షా కా తిరంగా కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించే సమయంలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే గోల్డెన్ అవర్(మొదటి గంట) అత్యంత కీలకమని వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్చేయడం లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. తక్షణమే పిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసి తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. లోన్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకోవద్దని బ్యాంకుల ద్వారానే రుణాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేటీపీపీ ఇన్చార్జ్ సీఈ కోటేశ్వర్ రావు, అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, గణపురం సీఐ కరుణాకర్రావు, కేటీపీపీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


