క్రమబద్ధీకరణకు నోచుకోని సమగ్ర శిక్ష ఉద్యోగులు
భూపాలపల్లి అర్బన్: విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు ఆశ, నిరాశలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరణకు నోచుకోవడం లేదని, శ్రమకు తగ్గ వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం టైం స్కేల్ ఇస్తామని ప్రకటించి క్షీరాభిషేకాలు చేయించుకుని మోసం చేసిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కూడా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 13 విభాగాల్లో 368 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు. కేజీబీవీల్లో 251 మంది, సీఆర్పీలు 65, ఎంఆర్సీ సిబ్బంది 46, డీఈఓ కార్యాలయ సిబ్బంది 6 మంది పని చేస్తున్నారు. కలెక్టర్ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించే యూడేస్, మధ్యాహ్న భోజన పథకం నివేదికల తయారీలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలక పాత్ర, బియ్యం పంపిణీ, పాఠశాల బయట ఉన్న విద్యార్థులను గుర్తించడం వంటి పనులు ఈ ఉద్యోగులే నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రాష్, ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యూకేషన్ బోధించే ప్రత్యేక ఉపాధ్యాయులు కూడా ఎస్ఎస్ఏ పరిధిలోకి వస్తారు.
తమ డిమాండ్ల సాధన కోసం 2024 డిసెంబరు 6నుంచి 2025 జనవరి 7వరకు సమ్మె కొనసాగించారు. సమ్మె విరమణ సమయంలో పేస్కేల్ అమలుపై మూడు నెలల్లో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వీలుగా ఉత్తర్వులు జారీచేస్తామని, సమ్మె కాలపు వేతనం అందజేస్తామన్నారు. కానీ ఇచ్చిన హామీల్లో ఇంతవరకు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ హక్కుల సాధనకోసం 15ఏళ్లుగా వివిధ సందర్భాల్లో పోరాటాలు చేస్తూనే వచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా తమ సమస్యలను పట్టించువడం లేదని వాపోతున్నారు.
పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో కుటుంబాల పోషణకు ఆవస్థలు పడుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా.. వచ్చే వేతనాలతో కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇప్పటికై నా తమను విద్యాశాఖలో విలీనంచేసి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్ట్ టైం ఉద్యోగులను ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించి వేతనం పెంచాలని రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. 61 ఏళ్లు నిండిన ఉద్యోగులకు రూ.20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని, మరణించిన ఉద్యోగుల కు టుంబాలకు రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఉద్యోగికి రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5లక్షల ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని వారు కోరుతున్నారు. ప్రతీ నెల 1వ తేదీన వేతనాలు అందించాలి.
సమ్మె చేసినా పరిష్కారం కాని
సమస్యలు
చాలీచాలని వేతనాలతో కుటుంబాల పోషణకు అవస్థలు
ప్రభుత్వంపై నమ్మకంతో ఆశగా
ఎదురుచూపు


