భూపాలపల్లి అర్బన్: అవయవదానం ఉద్యమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య కళాశాలలో అవయవ, శరీర, నేత్రదానంపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 3న వివిధ పోటీలు నిర్వహించగా, మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ప్రతీఒక్కరు అవయవదానం చేసే పరిస్థితిలో ఉండాలన్నారు. నేత్ర వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాజా భరత్ కుమార్ నేత్రదానం ప్రాముఖ్యతను వివరించి, అపోహలను తొలగించారు. తెలంగాణ కంటి, చర్మ, నేత్ర, దేహదాతల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ లింగం అవయవదానం, దేహదానం అవసరం, సామాజిక ప్రయోజనాలను వివరించి విద్యార్థుల్లో చైతన్యం కలిగించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్, డాక్టర్ అజయ్ ప్రకాశ్, మల్లారెడ్డి, చంద్రమౌళి, రాజు, భూమయ్య పాల్గొన్నారు.


