కాళేశ్వరం: పోలీసుశాఖపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించడమే లక్ష్యమని, పోలీసులు అన్ని వేళల ప్రజలకు అందుబాటులో ఉండి కేసుల పరిష్కారానికి కృషిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. సోమవారం ఎస్పీ వార్షిక తనిఖీల్లో భాగంగా కాళేశ్వరం పోలీస్ స్టేషన్ను సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ప్రతీ ఫిర్యాదును వెంటనే ఆన్లైన్లో నమోదుచేసి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్లో నమోదైన కేసుల పురోగతిని సమీక్షించి, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదుచేస్తూ కేసులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ, కేసు రికార్డుల నవీకరణ విధానాన్ని పరిశీలించి, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిర్వహించాలని ఆదేశించారు. రౌడీషీటర్లపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించి, వారిపై నిఘా కొనసాగించాలని సూచించారు. పోలీస్స్టేషన్లో ఉత్తమ పనితీరు కనబరిచిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ రమేశ్, ఉమెన్ కానిస్టేబుల్ రాణిలకు ఎస్పీ క్యాష్ రివార్డ్ అందజేశారు. ఆయన వెంట కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు తమాషారెడ్డి, భగవత్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారమే ప్రజాదివస్ లక్ష్యం
భూపాలపల్లి: ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం లక్ష్యంగా ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15మంది నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు లేదా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


