● ఏరియా సింగరేణి జనరల్ రాజేశ్వర్రెడ్డి
భూపాలపల్లి అర్బన్: భద్రతతో పాటు ఉత్పత్తి లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని అధికారులకు ఏరియా సింగరేణి జనరల్ రాజేశ్వర్రెడ్డి సూచించారు. సోమవారం ఏరియాలోని కేటీకే–1వ గనిని సందర్శించి 12 టన్నుల సామర్థ్యం గల క్రేన్ను జీఎం ప్రారంభించారు. ఈ క్రేన్ ద్వారా భారీ యంత్రాలు, పరికరాల నిర్వహణ, మరమ్మతు పనులు మరింత వేగంగా, సురక్షితంగా నిర్వహించవచ్చని తెలిపారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఉద్యోగి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 56వ వార్షిక భద్రతా వారోత్సవాల్లో ‘పిట్ సేఫ్టీ’ విభాగంలో ప్రథమ, ‘సాండ్ స్టోవింగ్ మైన్స్’ విభాగంలో తృతీయ బహుమతి సాధించిన కేటీకే–1 ఉద్యోగులను అభినందించారు. గనిలో ఉత్పత్తి, భద్రతా ప్రమాణాలు, యంత్రాల నిర్వహణను సమీక్షించిన జీఎం, భద్రతకు రాజీ పడకుండా ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు. కార్మిక సంక్షేమం, పరిశుభ్రత, క్రమశిక్షణ, నాణ్యతా ప్రమాణాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు సాంబశివరావు, రవీందర్, రవికుమార్, రాజారావు, తిరుపతి, సారంగపాణి, సదయ్య, సమ్మయ్య, రఘుపతి పాల్గొన్నారు.


