కాళేశ్వరం: గోదావరి, ప్రాణహిత నదుల ఉధృతితో మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12.300 మీటర్ల మేర నీటి మట్టం శుక్రవారం నమోదు కాగా, మొదటి ప్రమాద హెచ్చరికను అధికారుల జారీ చేశారు. గోదావరి తీరం వద్ద ఉన్న చిరు వ్యాపారులను అప్రమత్తం చేశారు. దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తింది. అక్కడ ఇన్ఫ్లో 10,62,240 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా, మొత్తం 85గేట్లు ఎత్తి ఔట్ఫ్లో రూపంలో దిగువకు అదేస్థాయిలో నీటిని ఇంజనీర్లు వదిలిపెట్టారు. కాగా, ఎగువన అన్నారం బ్యారేజీ వద్ద 87వేల క్యూసెక్కుల గోదావరి వరద ఇన్ప్లో కాగా, మొత్తం 66గేట్లు ఎత్తి అదేస్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. సాయంత్రం కాళేశ్వరం వద్ద 11.920 మీటర్ల నీటి మట్టం నమోదైందని సీడబ్ల్యూసీ, ఇరిగేషన్శాఖ అధికారులు వెల్లడించారు.


