● గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్ సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్ మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తులతో అనవసరంగా మాట్లాడడం, స్నేహం చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఉద్యోగాలు, చదువులు లేదా ఇతర అవకాశాల పేరుతో మోసగాళ్లు అమాయకులను వలలో వేసుకునే అవకాశం ఉందన్నారు. అలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. మానవ అక్రమ రవాణా వంటి నేరాలను అరికట్టాలంటే ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, డీఎల్ఎస్ఏ సభ్యుడు మంగళపల్లి రాజ్కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీప్రసన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


