కాళేశ్వరం: ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసులు నిస్పక్షపాతంగా సేవలు అందించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బుధవారం ఆయన వార్షిక తనిఖీల్లో భాగంగా మహదేవపూర్ పోలీస్స్టేషన్ను సందర్శించారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్స్టేషన్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. రోడ్డు ప్రమాద కేసులకు సంబంధించిన వాహనాల స్థితిగతులు, వాటి పరిష్కార పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అందిన ప్రతీ ఫిర్యాదును వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్లో నమోదైన కేసుల పురోగతి, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తూ కేసులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ, కేసు రికార్డుల నవీకరణ విధానాన్ని పరిశీలించి, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. రౌడీషీటర్లపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించి, వారిపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రతీ పౌరుడికి స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించాలని అధికారులు, సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు సాంబమూర్తి, రమేశ్ పాల్గొన్నారు.
ఆన్లైన్ నమోదుపై ప్రత్యేక దృష్టి
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


