జిల్లాలో లబ్ధిదారుల వివరాలు..
భూపాలపల్లి: వర్షాకాలం నేపథ్యంలో పేదలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేసేందుకు మార్గం సుగమమైంది. హైకోర్టు ఆదేశాలతో వచ్చే నెల 1వ తేదీ నుంచి జిల్లాలోని లబ్ధిదారులందరికీ ఉచిత బియ్యం పంపిణీ జరుగనుంది. కార్డుదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రవాణా, పంపిణీ విషయంలో సివిల్ సప్లయీస్ అధికారులు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో వర్షాకాలంలో రేషన్ బియ్యం పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని వచ్చే నెలలోనే సరఫరా చేయాలని ప్రభుత్వం భావించింది. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి దిగుమతి, స్టాక్, పంపిణీ చేయడం రేషన్డీలర్లు ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో డీలర్ల సంఘం ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా ముందస్తు ప్రణాళికలతో బియ్యం సేకరణ, పంపిణీని పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.
జిల్లాలోని 12 మండలాల్లో అంత్యోదయ కార్డులు 9,537, ఆహార భద్రత 1,29,960, అన్నపూర్ణ 33, మొత్తంగా 1,39,530 కార్డులు ఉండగా ఆయా కార్డుల్లో 3,95,964 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో అంత్యోదయ కార్డు కలిగి ఉన్న కుటుంబం మొత్తానికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు ఉన్న వృద్ధులకు 10 కిలోలు, ఆహార భద్రత కార్డు ఉన్న వారిలో ఒక్కో కుటుంబ సభ్యుడికి ఆరు కేజీల బియ్యం చొప్పున మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించాల్సి వస్తుండటంతో పౌరసరఫరాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సివిల్ సప్లయీస్ గోడౌన్ల నుంచి బియ్యం తరలింపు ప్రక్రియ మొదలైంది. ఈ నెల 31వ తేదీలోగా బియ్యం నిల్వలను డీలర్ల దుకాణాలకు చేర్చేందుకు సిద్ధమవుతున్నారు. పంపిణీ విషయంలో లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైకోర్టు ఆదేశాలతో వీడిన సందిగ్ధత
వచ్చే నెల 1వ తేదీ నుంచి షురూ
పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న
సివిల్ సప్లయీస్ అధికారులు
జిల్లాలో 3,95,964 మంది
లబ్ధిదారులు
మండలం అంత్యోదయ ఆహార భద్రత
భూపాలపల్లి 3,090 66,110
చిట్యాల 1,686 34,154
గణపురం 1,651 35,089
కాటారం 3,784 32,786
పలిమెల 524 7,574
మహాముత్తారం 3,105 23,548
మహదేవపూర్ 1,994 30,414
మల్హర్ 3,299 24,137
మొగుళ్లపల్లి 1,858 32,772
టేకుమట్ల 1,152 25,341
రేగొండ 1,346 40,347
కొత్తపల్లిగోరి 755 19,415
అన్నపూర్ణ కార్డు లబ్ధిదారులు కాటారం
మండలంలో 31మంది, రేగొండలో
ఇద్దరు ఉన్నారు


