● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: చిన్నచిన్న తప్పిదాలతో భారీ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వచ్చే నెల 1వ తేదీ నుంచి జిల్లా పోలీసు, రవాణాశాఖ సంయుక్తంగా అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా మైనర్లు వాహనాలు నడపడం, వాహనదారులు హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీటుబెల్ట్ ధరించకపోవడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్ తదితర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసు శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత కూడా అన్నారు. ప్రతీ ఒక్కరు రహదారి భద్రతా నియమాలను పాటించి అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పీ సంకీర్త్ కోరారు.


