గణపురం: రైతులు కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మంగళవారం గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామంలో రైతులు పండిస్తున్న కూరగాయల సాగు క్షేత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు బూర యాదగిరి, మార్త రమేశ్ తదితరులతో కలెక్టర్ మాట్లాడారు. పంట సాగు మార్కెటింగ్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రైతాంగం తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో అధిక లాభాలను పొందే పంటలను ఎన్నుకోవాలన్నారు. ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటలు వేయడంతో చీడపీడల ఉధృతి తగ్గి ఆదాయం పెరుగుతుందన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని జిల్లాలో రైతులు ఆధునిక సాగు పద్ధతులు చేపట్టాలని సూచించారు. అధికారులు రైతులకు అవసరమైన కూరగాయలు, పప్పు దినుసులు సాగు చేపట్టేలా సలహాలు ఇస్తూ వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహాలను అందించాలన్నారు. ఇతర రైతులకు లాభాలు, సాగు విధానం వివరించేందుకు సోమవారం ఐడీఓసీ కార్యాలయం వద్ద స్టాల్ ఏర్పాటు చేపించాలని ఉద్యానవన శాఖ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగు అభినందనీయం
భూపాలపల్లి రూరల్: వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయడం అభినందనీయమని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ గుర్రంపేట గ్రామంలో పర్యటించి, క్షేత్రస్థాయిలో పంట మార్పిడి విధానంలో చేపట్టిన కంది సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా గ్రామంలోని రైతులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయడం ఆదర్శనీయమన్నారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఉద్యానవన అధికారి తిరుపతి, తహసీల్దార్ లక్ష్మి రాజయ్య, ఇతర అధికారులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్శర్మ


