భూపాలపల్లి అర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన ప్రతి విద్యార్థికి రూ.10వేల నగదు ప్రోత్సాహక బహుమతి అందజేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ప్రకటించారు. మంగళవారం భూపాలపల్లి మండలం గొర్లవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులతో సమావేశమై ఈ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు అనిత ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎమ్మెల్సీకి ఘనస్వాగతం పలికి సన్మానించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి శ్రీపాల్రెడ్డి మాట్లాడారు. బాల్యదశలో అలవర్చుకునే క్రమశిక్షణ, సత్ప్రవర్తన, గురువులు, తల్లిదండ్రులు, పెద్దల పట్ల గౌరవభావం వంటి విలువలే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి బలమైన పునాదులని పేర్కొన్నారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. జెడ్పీహెచ్ఎస్ గొర్లవీడు పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పీఆర్సీ సాధన, సీపీఎస్ రద్దు లక్ష్యంగా త్వరలో ఉద్యమ కార్యాచరణ చేపడుతామని తెలిపారు. ఉపాధ్యాయులందరూ ఐక్యంగా ఉద్యమంలో పాల్గొని హక్కుల సాధన జరిగే వరకు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షక్ష, కార్యదర్శులు రేగూరి సుభాకర్రెడ్డి, కిరణ్కుమార్, హనుమకొండ, వరంగల్ జిల్లా బాధ్యులు మందల తిరుపతిరెడ్డి, పలిత శ్రీహరి, ఈదునూరి రవీందర్రెడ్డి, నక్కిరెడ్డి మహేందర్, గఫార్, మండల బాధ్యులు రఘునాథ్రెడ్డి, కుసుమ వెంకటేశ్వర్లు, సర్పంచ్ లావణ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి


