జిల్లా గ్రంథాలయం గోడలపై ఏర్పాటు చేసిన చిత్రాలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ భవనానికి ఆకర్షణీయమైన రంగులు, అద్భుతమైన గోడ చిత్రాలతో సరికొత్త రూపును కలెక్టర్ రాహుల్శర్మ కల్పించారు. గ్రంథాలయం వెలుపలి గోడలపై విద్యార్థులు పుస్తకాలు చదువుతున్న దృశ్యాలు, పుస్తకాల వరుసలు, ప్రకృతి అందాలు, జ్ఞానానికి ప్రతీకలైన చిత్రాలను అందంగా చిత్రీకరించారు. ‘అదృష్టాన్ని కాదు... కష్టాన్ని నమ్ము’, ‘గ్రంథాలయం విలాసవంతమైనది కాదు... జీవితానికి అవసరమైనది’, ‘గ్రంథాలయం మనసులను తెరుస్తుంది... హృదయాలకు స్ఫూర్తినిస్తుంది.. భవిష్యత్ను నిర్మిస్తుంది’, ‘పుస్తకాన్ని తెరవండి... మీ ఆలోచనలకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయండి’ అనే భావాన్ని ప్రతిబింబించే సందేశాలను అర్థమయ్యేలా చిత్రాల ద్వారా ఆవిష్కరించారు. ఈ చిత్రలేఖనాలతో గ్రంథాలయం మరింత ఆహ్లాదకరంగా, ఆహ్వానించే విద్యా వాతావరణంగా మారింది. విద్యార్థులు, యువతలో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించడంతో పాటు గ్రంథాలయాల ప్రాధాన్యాన్ని గుర్తుచేసేలా ఈ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రకృతి సోయగాలతో తీర్చిదిద్దిన ఈ భవనం ప్రస్తుతం భూపాలపల్లి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది.


