● కలెక్టర్ రాహుల్శర్మ
భూపాలపల్లి అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అందించిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో మొత్తం 78 దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రతీ దరఖాస్తును అధికారులు నిశితంగా పరిశీలించి, సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తులను పరిష్కరించినప్పుడే ప్రజలకు అధికారులపై నమ్మకం పెరుగుతుందని తెలిపారు. అనంతరం సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార పురోగతి, జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రజావాణి అర్జీలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం సీఎం ప్రజావాణికి సంబంధించిన 57 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంటూ, వాటిని తక్షణమే పరిష్కరించి తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఆర్ఓ వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


