బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రామంలోని స్వయంభూ శ్రీసిద్ధేశ్వరాలయ హుండీ ఆదాయం రూ. 5,11,472 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి చిందం వంశీ తెలిపారు. గురువారం హుండీ లెక్కించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మార్చి 24 నుంచి ఆగస్టు 20 వరకు భక్తులు హుండీలో వేసిన కానుకల రూపేణా ఈ ఆదాయం వచ్చిందన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్రావు పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు చేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఈదులకంటి వెంకట్రెడ్డి, ప్రధాన పూజారి ఓంనమశివాయ, సిబ్బంది నూకల లక్ష్మికాంత్రెడ్డి, బండారి శ్రీనివాస్, భానుప్రకాష్రెడ్డి, అర్చకులు, శ్రీలక్ష్మీవెంకటేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ: ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాల నిరోధక చట్టం అమలును పర్యవేక్షించే జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీలో అధికారేతర సభ్యుల నియామకానికి అర్హులైన జిల్లా వాసుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విక్రమ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీలో ఎస్సీ కులాలకు చెందిన ఐదుగురు సభ్యులు, ఎస్టీ వర్గం నుంచి ఇద్దరు సభ్యుల్లో కనీసం ఒకరు మహిళ ఉండాలన్నారు. ఇతర వర్గాలకు చెందిన ముగ్గురిని కూడా సభ్యులుగా నియమించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలు, నిర్ణీత దరఖాస్తు నమూనా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో, జిల్లా వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందన్నారు. సెప్టెంబరు 5వతేదీ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందించాలన్నారు.
ఎస్ఐఆర్పై ఈఆర్ఓలకు శిక్షణ
జనగామ: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా విడుదల అనంతరం సాంకేతిక, పరిపాలనాపరమైన చర్యలను వేగవంతం చేసేందుకు జిల్లా స్థాయిలో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, అధికారులకు గురువారం కలెక్టరేట్లో మాస్టర్ ట్రేనర్లు సాఫ్ట్వేర్ విధానాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో ఓటర్ల వివరాల్లోని తప్పులను సరి దిద్దడం, బాధ్యులైన ఓటర్లకు నోటీసులు ఇవ్వ డం, దరఖాస్తుల విచారణ, తుది జాబితా రూపకల్పనపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కాగా, మండలాల వారీగా బీఎల్ఓలకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో రెవెన్యూ ఏసీ బెన్షాలోమ్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీధర్, ఆర్డీఓ గోపీరామ్, తహసీల్దార్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పీజీ సెమిస్టర్ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సు ల (నాన్ ప్రొఫెషనల్) రెండో సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని పలు పరీక్ష కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్ష ల నియంత్రణాధికారులు పరిశీలించారు.


