నర్మెట: గ్రామాల అభివృద్ధికి పంచాయతీ పాలక వర్గాలు బాటలు వేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అదనపు డీఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారి నాగశేషాద్రిసూరి అన్నారు. మండలంలోని 17 పంచాయతీల్లో శనివారం గ్రామసభలు నిర్వహించగా మచ్చుపహాడ్, గండిరామారం, లోక్యతండా సభలకు ఆయన హాజరయ్యారు. ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, ఏపీఓ రమాదేవి, సర్పంచ్లు పాల్గొన్నారు.
వాచ్మన్ కుటుంబానికి ‘పల్లా’ పరామర్శ
జనగామ: మండలం యశ్వంతపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయ వాచ్మన్ మబ్బు ఎల్లయ్య గుండెపోటుతో శని వారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
బాస్కెట్బాల్ గ్రౌండ్ ప్రారంభం
జనగామ: పట్టణంలోని నెహ్రూపార్కు ఏరియా సెయింట్ పాల్స్ స్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన తరగతి గదులతో పాటు బాస్కెట్ బాల్ గ్రౌండ్ను వరంగల్ బిషప్ డాక్టర్ డి.విజయపాల్రెడ్డి ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ మరిజ జోసఫ్ ఆధ్వర్యంలో జరిగిన స్వా తం త్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫాదర్ ఆగస్టిన్రెడ్డి, ఇన్నారెడ్డి, సునీల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాపర్వైరు చోరీ
చిల్పూరు: మండలంలోని వంగాలపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావుల వద్ధ ఉన్న ట్రాన్స్ఫార్మర్ను గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి పగులగొట్టి అందులోని కాపర్ వైరును ఎత్తుకెళ్లారు. రైతులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంస్థకు రూ. 2 లక్షల వరకు నష్టమని తెలిపారు.
నిధుల గోల్మాల్పై కొనసాగుతున్న విచారణ
జఫర్గఢ్: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన నిధుల గోల్మాల్పై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఫోర్జరీ సంతకాలతో పాఠశాలకు సంబంధించిన నిధులు స్వాహ చేసిన విషయం బైటకు రావడంతో సంబంధిత అధికారులు విచారణ చేపడుతున్నారు. శనివారం సంబంధిత శాఖ జోనల్ అధికారి విద్యారాణి విచారణ చేపట్టారు.


