● సన్నరకం వరిపంట సాగుచేసే రైతులకు అధికారుల సూచన
బచ్చన్నపేట: అన్నదాతలు సాగుచేసే సన్న రకాల వరిపంటకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ అదనంగా చెల్లిస్తున్న విషయం తెలిసిందే. దీంతో రైతులు ఎక్కువగా సన్నరకం పంటలు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కేఎన్ఎం–1638, బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048, కేఎన్ఎం– 7715, జైశ్రీరాం, హెచ్ఎంటీ– సోనా, వరంగల్– 44 (సిద్ది) రకాలకు మాత్రమే ప్రభుత్వం బోనస్ డబ్బులను ఇస్తామని ప్రకటించింది. అయితే సన్నరకాలను సాగుచేసిన అన్నదాతలు తప్పకుండా ఆన్లైన్లో ఆయా గ్రామాల క్లస్టర్ ఏఈఓల వద్ద లేదా విత్తనాలు కొనుగోలు చేసిన సీడ్ డీలర్ల వద్దనైనా ఆన్లైన్ చేసుకోవాలని లేకుంటే రైతులు బోనస్ నష్టపోతారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
మండలంలోని 26 గ్రామాల్లో సన్నరకం వరి పంటలను సాగు చేసిన అన్నదాతలను గుర్తించి ఏఈఓలు అవగాహన కలిగిస్తున్నారని మండల వ్యవసాయాధికారి శరత్చంద్ర తెలిపారు. ఇంకా ఎవరైనా ఆన్లైన్ చేయని వారు ఏఈఓల వద్ద ఆన్లైన్ చేసుకోవాలన్నారు.


