లింగాలఘణపురం: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పోలీసు సిబ్బందితో కలిసి ఆవరణలో ఉన్న చెత్తాచెదారం తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని కాపాడుకోవాలని డీసీపీ సూచించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రావణ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కొనసాగుతున్న
ఇంటర్ పరీక్షలు
జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి కె.జితేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన సెకండియర్ పరీక్షకు 94 మంది విద్యార్థులు గైర్హాజర్ అయ్యారని తెలిపారు. జనరల్లో 2,830 మంది విద్యార్థులకు 2,792 హాజరు కాగా 38 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 995 విద్యార్థులకు 939 హాజరు కాగా 56 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య సమస్యపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవతో పనిచేయాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మొదటిరోజైన శుక్రవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, మేనేజర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు, మహిళలు పాల్గొన్నారు.
స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ రాధాకృష్ణ వైఖరిపై పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. కాగా సమావేశం ప్రారంభంలోనే పొన్న రాజేష్, బస్వగాని అనిల్ తదితర కౌన్సిలర్లు కమిషనర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం విషయమై కనీసం తమకు సమాచారం లేదని, వార్డుల్లో ఏదైనా సమస్య విషయమై ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదని వాగ్వాదం చేయడంతో కాసేపు సభ రసాభాసగా మారింది. కాగా అందరూ సంయమనం పాటించాలని చైర్మన్ సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
వేయిస్తంభాల గుడిలో
సంకటహరచతుర్థి పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సంకటచతుర్థిని పురస్కరించుకుని సాయంత్రం దేవాలయంలోని కాకతీయుల కాలంనాటి ఉత్తిష్టగణపతికి అభిషేకాలు నిర్వహించారు. గణపతికి ఇష్టమైన గరికతో అష్టోత్తరశతనామాలు పఠిస్తూ షోఢశోపచార పూజలు చేశారు. మహాహారతి మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.


