లింగాలఘణపురం: ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేయడమే ‘ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’ ప్రథమ లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. విద్య, వైద్యం, సాగునీరు, పంటల దిగుబడికి నియోజకవర్గంలో ప్రాముఖ్యం కల్పించడం జరుగుతుందని, జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్య స్థితిగతులను పరీక్షించి ప్రత్యేక హెల్త్కార్డులను జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో జనగామ, జఫర్గఢ్లో డయాలిసిస్ సెంటర్లు ఉన్నాయని, నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్లో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణం డిసెంబర్ వరకు పూర్తి చేయాలన్నారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా డెంగీ, మలేరియా సోకకుండా దోమల నివారణకు ప్రతీ గ్రామంలో పిచికారి చేయడం జరుగుతుందని, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు మాట్లాడుతూ 99 రోజుల కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో ప్రోగ్రామ్ ఇన్చార్జ్ రాజేశం, వివిధ విభాగాల డాక్టర్లు ఉమాదేవి, అరుణకుమారి, ప్రదీప్, దీప్తి, క్రాంతిస్వరూప్, అనిల్ వైద్య సేవలు అందించారు. ఆర్డీఓ గోపీరామ్, 108 జిల్లా ఇన్చార్జ్ రాములు, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ శివశంకర్రెడ్డి, స్థానిక వైద్యాధికారి స్వర్ణలత, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
పంటల దిగుబడిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’
ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి


