రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
జనగామ రూరల్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. గురువారం రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో భాగంగా పట్టణంలో బైక్ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా వాహనదారులకు హెల్మెట్లు బహూకరించి రోడ్డు భద్రతపై సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండారీ చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐలు వాహనదారులు పాల్గొన్నారు.
మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
జనగామ: జిల్లాలో శుక్రవారం రాష్ట్రమంత్రి సీతక్క పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించారు. సీఐ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డితో కలిసి డీసీపీ ఆయా ప్రాంతాలను సందర్శించారు.
జనగామ రూరల్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు కోర్టు ద్వితీయ శ్రేణి స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్గా జనగామ జిల్లా కోర్టుకు చెందిన న్యాయవాది కోట రామ్రెడ్డిని నియమిస్తూ తెలంగాణ హైకోర్టు లీగల్ అఫైర్స్ సెక్రటరీ పాపిరెడ్డి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాంరెడ్డి జనగామ జిల్లా కోర్టులో 15 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తిని నిర్వహిస్తున్నారు. కోటా రామ్రెడ్డి రెండో శ్రేణి స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్గా నియామకం కావడంపై జిల్లా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
జనగామ రూరల్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలకు 72 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ గురువారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 52 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో 3,965 మంది విద్యార్థులకు గాను 3,893 హాజరయ్యారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగాయని తెలిపారు.
వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి
జనగామ రూరల్: జిల్లాలో వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలని సూపరింటెండింగ్ ఇంజనీర్ సంపత్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో హెచ్టీ వినియోగదారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..వినియోగదారుల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు అధికారులు చొరవ తీసుకోని వాటిని పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు ముత్తయ్య, డివిజనల్ ఇంజనీర్ లక్ష్మీనారాయణరెడ్డి, డీఈ టెక్నికల్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
జనగామ: కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడం ప్రజాసమస్యల నుంచి దృష్టిమళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్ష్యసాధింపు చర్య అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. దీని వెనుక పూర్తి రాజకీయ దురుద్దేశమే ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే సిట్ నోటీసులను ఆయుధంగా ఉపయోగిస్తున్నారని, ఈ కుట్ర ఎంత పెద్దదైనా తాము భయపడదని స్పష్టం చేశారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ 9వ సమావేశం నిర్వహించనున్నట్లు హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం అధిపతి డాక్టర్ చిలువేరు రాజ్కుమార్ తెలిపారు. ఈమేరకు క్యాంపస్లో గురువారం పోస్టర్ను వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఆచార్యులు బి.సురేశ్లాల్, ఆర్.మల్లికార్జున్రెడ్డి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి


