‘ఉజ్వల’తో మహిళలు, బాలికలకు భరోసా
పాలకుర్తి టౌన్: మహిళలు, బాలికల హక్కులు, భద్రత, ఆరోగ్యం, విద్యపై సమగ్ర అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘ఉజ్వల’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ‘భవిత మీది–భరోసా మాది’ అనే నినాదంతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా జిల్లాలోని పాలకుర్తి మండలం గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్రనాయక్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ శాఖల సమన్వయంతో ప్రతీ బుధవారం జిల్లాలోని పాఠశాలల్లో ఉజ్వల కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ ఇవ్వకూడదన్నారు. అనంతరం కలెక్టర్, డీసీపీ విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఏసీపీ నర్సయ్య, ఆర్డీఓ వెంకన్న, జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు, సర్పంచ్ హెచ్ఎం శైలజ, మాజీ సర్పంచ్ పుల్లయ్య, వివిధ శాఖల అధికారులు, విద్యార్థుల తల్లిండ్రులు పాల్గొన్నారు. అనంతరం ఈనెల 23న ప్రారంభం కానున్న మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్హాల్ను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు.
‘గణతంత్ర’ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి..
జనగామ రూరల్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులు సమన్వయంతో పనిచేయాలని అందుకు తగిన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఈనెల 28వ తేదీ నుంచి 31 వరకు మేడారం జాతరకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జిల్లాలోనే మొదటిసారిగా గూడూరు ఉన్నత పాఠశాలలో ప్రారంభం


