రూ.2వేల కోట్లతో వరంగల్ అభివృద్ధి
ఖిలా వరంగల్/హన్మకొండ/హన్మకొండ కల్చరల్: రూ.2వేల కోట్లతో వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు. సంక్షేమాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్.రాంచందర్ రావు రెండు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టారు. దీనిలో భాగంగా గురువారం హనుమకొండకు వచ్చిన ఆయనకు కాజిపేటలోని కడిపికొండ బ్రిడ్జి వద్ద పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా వరంగల్లోని భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడినుంచి బయలుదేరి హనుమకొండ హంటర్రోడ్ నందిహిల్స్ వద్దకు చేరుకుని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేద బాంక్వెట్హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక్కడే మధ్యాహ్న భోజనం చేసిన తరువాత వరంగల్కు ర్యాలీగా బయలుదేరారు. అనంతరం శాంతినగర్లోని రాజశ్రీ గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాజీపేట కోచ్ఫ్యాక్టరీ నిర్మాణం, మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ పనులు మోదీ ఆధ్వర్యంలో పూర్తవుతాయని చెప్పారు. హెల్త్ యూనివర్సిటీ కూడా కేంద్ర ప్రభుత్వ చొరవతో ఏర్పడిందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిందేనని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం.గౌతం రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, వేముల అశోక్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, ఎం.ధర్మారావు, వన్నాల శ్రీరాములు, డాక్టర్ రాజేశ్వర్రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, కుసుమ సతీశ్, తిరుపతిరెడ్డి, రఘునాఽరెడ్డి, డాక్టర్ వన్నాల వెంకటరమణ, ఎన్.వి.సుభాష్, డా.కాళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన
బీఆర్ఎస్, కాంగ్రెస్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
నాయకులు, కార్యకర్తల ఘనస్వాగతం


