
గ్రాఫ్ పడిపోతోంది
జనగామ: ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యావ్యస్థపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం విద్యార్థులకు శాపంగా మారుతోంది. 2022 నుంచి నేటి వరకు ఉత్తీర్ణత శాతం పడిపోవడమే ఇందుకు నిదర్శనం. తరగతి గదిలో అధ్యాపకులు చెప్పే బోధన అర్థం కావడం లేదా.. లేక విద్యార్థుల్లోనే లోపం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా పదో తరగతి వార్షిక పరీక్షల సమయంలో మూడు నెలల ముందుగానే ప్రత్యేక తరగతులతో సన్నద్ధం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇంటర్ మీడియట్కు వచ్చే సరికి విద్యార్థులను పట్టించుకోవడంలేదు. ఫలితంగా కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిపోవడంతో అంతా ప్రైవేట్ వైపు వెళ్తున్నారు.
తగ్గుతున్న ఉత్తీర్ణత శాతం
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల కళాశాలలు 57 ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా ప్రభుత్వ ఇంట ర్ మీడియట్ కాలేజీల పరిధిలో ఈసారి ఆశించిన ఉత్తీర్ణత శాతం నమోదు కాలేదు. ఏడు జూనియర్ కాలేజీలు, ఎంజేపీ, సోషల్ వెల్ఫేర్, మోడల్, మైనా ర్టీ కాలేజీల పరిధిలో ఫస్టియర్, సెకండియర్, ఒకేషనల్(ప్రైవేట్) విభాగంలో 7,924 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,450 మంది ఉత్తీర్ణత(64.35 శాతం) సాధించినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 5 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఫస్టియర్లో 298 మంది విద్యార్థులకు 148 మంది (49.66శాతం), సెకండియర్లో 293 మందికి 202 మంది ఉత్తీర్ణత(68.94శాతం) సాధించారు. ఇక ఎంజేపీ గురుకులాల విషయానికి వస్తే అత్యుత్తమంగా 89.8 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జూనియర్ కళశాలల్లో మాత్రం ఉత్తీర్ణత దారుణంగా పడిపోయింది. ఫస్టియర్లో జఫర్గఢ్ 17.5 శాతం, సెకండియర్ 23.97 శాతం, స్టేషన్ఘన్పూర్ ఫస్టియర్ 11.24, సెకండియర్ 25.79, జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫస్టియర్ 19.35, సెకండియర్ 20.95 శాతం పాస్ అయ్యారు. ఇదిలా ఉండగా.. 2022లో 77.93, 2023లో 63.70, 202 4లో 62.44, 2025లో 64.35శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో గడిచిన మూడేళ్ల ఫలితాలను పరిశీలిస్తే.. జూని యర్ కళాశాలల ప్రగతి ఒక్కోమెట్టు పడిపోతున్న విషయం అర్థమవుతోంది. 2025–26 విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించే దిశగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
జిల్లాలో గడిచిన నాలుగేళ్లుగా నమోదైన ఇంటర్ ఫలితాల వివరాలు(శాతంలో..)
77.93
64.35
62.44
63.70
2022 2023 2024 2025
2022 నుంచి తగ్గుతున్న ఇంటర్ ఉత్తీర్ణత శాతం
విద్యాబోధనపై కొరవడిన పర్యవేక్షణ