● హైకోర్టు న్యాయవాది సాధిక్ అలీ
జనగామ రూరల్: సుస్థిర జీవన విధానానికి సరళమైన మార్పులు అవసరమని హైకోర్టు న్యాయవాది సాధిక్ అలీ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం సమాచార కేంద్రం, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యాన పట్టణంలోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత విధానానికి అనేక మార్పులు చేసుకుంటే తప్ప సుస్థిర జీవనం సాధ్యం కాదన్నారు. ఒక వైపు ప్రకృతిని విధ్వంసం చేస్తూ మనం మంచి జీవితాన్ని పొందలేమని పేర్కొన్నారు. సమాజ మార్పును యువతే తేగలదని, ఇందుకు డిగ్రీ, పీజీ విద్యార్థినీ విద్యార్థులు నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీందర్, కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల శాఖ డీటీ భీమా తదితరులు పాల్గొన్నారు.