జగిత్యాలరూరల్: విద్యుత్ కోతలతో రైతులు, పారిశ్రామిక వేత్తలు, గృహ అవసరాల వినియోగదారులు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు అల్లాడిపోతున్నారు. ఇటు వర్షాలు లేక, అప్రకటిత విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయపాలన లేకుండా కరెంట్ తీసేస్తుండడంతో పంటలకు సాగునీరు అందక చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతులకు అందని త్రీఫేజ్
జిల్లాలో రైతులకు 12 గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, కనీసం 9 గంటలు కూడా అందడం లేదు. దీంతో సాగుచేసిన వరి పొలాలు, ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయి. చేతికందే సమయంలో కళ్ల ముందే పంటలు ఎండిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు, లోవోల్టేజీతో విద్యుత్ సరఫరా అవుతుండటంతో రోజుకు వందలాది వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయి.
రోజుకు 4.93 మిలియన్ యూనిట్ల అవసరం
జిల్లాలో వ్యవసాయం, పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, కమర్షియల్ వినియోగదారులకు రోజూ 4.93 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా, ప్రస్తుతం అధికారులు 3.11 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తున్నారు. దీంతో సమయపాలన లేకుండా విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. రాత్రివేళ ఒక గంట, మధ్యాహ్నం సమయంలో 2 గంటల పాటు అధికారులు విద్యుత్ కోత విధిస్తున్నారు.
సోలార్ ద్వారా 59 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి
జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్ట్లు ఐదు ఉండగా, వాటి ద్వారా మధ్యాహ్నం సమయంలో 59 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీంతో ఆ విద్యుత్ను మధ్యాహ్న సమయంలో సరఫరా చేస్తున్నారు. దీంతో కొంత వెసులుబాటు ఉన్నా, పూర్తిస్థాయిలో విద్యుత్ సరిపోక అన్ని వర్గాల వారికి ఇబ్బందులు తప్పడ లేదు.
లోవోల్టేజీతో సాంకేతిక సమస్యలు..
జిల్లాలో అవసరం మేరకు విద్యుత్ సరఫరా లేక లోవోల్టేజీతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యుత్ సబ్స్టేషన్లలో ఫ్యూజ్లు కాలిపోవడం, జంపర్లు తెగిపోవడంతో పాటు, ఇతర సమస్యలు తలెత్తుండటంతో సరఫరా నిలిచిపోతోంది.
జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు
గృహ కనెక్షన్లు 3,43,086
కమర్షియల్ 44,589
పరిశ్రమలు 2,988
కుటీర కనెక్షన్లు 1,434
వ్యవసాయ కనెక్షన్లు 1,41,464
స్ట్రీట్లైట్స్, వాటర్ సరఫరా 6,217
ఆలయాలు, స్కూళ్లు 2,377
తాత్కాలిక కనెక్షన్లు 253
‘జగిత్యాల రూరల్ మండలం
పొరండ్ల గ్రామానికి చెందిన సామల్ల గంగారాం ఎకరం విస్తీర్ణంలో వరిపంట సాగుచేశాడు. ఇటీవల వర్షాలు లేకపోవడంతో పాటు, విద్యుత్ కోతలతో 20 గుంటల వరిపంట పూర్తిగా ఎండిపోయింది. ఇలా ఇతనొక్కడే కాదు.. జిల్లాలోని పలువురు రైతుల పంటలు నీరులేక ఎండిపోతున్నాయి.’
ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక జిల్లాలో విద్యుత్ వినియోగం భారీగా పెరి గింది. దీంతో రైతులకు ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది.
– సుదర్శనం, ఎస్ఈ


