జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో సాగు నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ప్రతీ సీజన్లో 3 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేస్తారు. వానాకాలం సీజన్లో కనీసం 1.50 లక్షల ఎకరాల్లో సన్న వరి ధాన్యం వేస్తారు. ప్రభుత్వం తాజాగా ఏడు రకాల సన్నధాన్యానికి మాత్రమే క్వింటాల్కు మద్దతు ధరకు తోడు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. గతేడాది 33 రకాల సన్న రకాలకు బోనస్ వర్తింపజేయగా, ఈ ఏడాది 7 రకాలకే స్తామనడంతో ఇతర రకాలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆందోళనలో రైతులు
ఈ ఏడాది ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో 2.75 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 1.50 లక్షల ఎకరాల్లో సన్నవరి వేశారు. రైతులు తమకు నచ్చిన, తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే సన్నరకాలను వేశారు. ప్రస్తుతం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆమోదించిన బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం–68, డబ్ల్యూజీఎల్–44, కేఎన్ఎం–7715 రకాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించింది.
లేని పోని నిబంధనలు
ప్రభుత్వం సూచించిన వరి రకాలను మాత్రమే ఎలా గుర్తిస్తారనే దానిపై స్పష్టమైన విధి విధానాలు లేవు. కానీ, సన్న ధాన్యం గింజ పొడవు 6 మి.మీటర్లకు తక్కువ, పొడవు–వెడల్పు నిష్పత్తి 2.5 కంటే ఎక్కువ మించకుండా ఉన్న రకాలనే పరిగణించే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు సన్నరకం విత్తనాలను డీలర్ల వద్ద కొన్నారా, లేదా సొంత విత్తనాలను ఉపయోగించారా వంటి వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేయించాలి. వరి నాట్లు వేసిన తర్వాత నెల లోపు సంబంధిత ఏఈవో వద్ద క్రాప్ బుకింగ్ పోర్టల్లో సన్న ధాన్యం సాగు చేసినట్లు చూపించాల్సి ఉంటుంది. పంట పండిన తర్వాత సన్న ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని నిబంధనలను తెరపైకి తీసుకవస్తున్నారు. ఇలా, సన్నరకం సాగు వివరాలను పౌరసరఫరాల సంస్థకు అందిస్తారు. ఆ సంస్థ తమ వద్ద ఉన్న డేటా ఆధారంగా ఆ రైతుల సన్నధాన్యం మాత్రమే కొనుగోలు చేసి బోనస్ ఇవ్వనున్నారు.


