● సర్పంచ్, వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులు ● తమను గె
జగిత్యాల: గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. గతంలో ఎక్కువగా మొబైల్ ఫోన్లు లేకపోవడంతో వాల్పోస్టర్లు, విసిటింగ్ కార్డులు, కరపత్రాలు, బ్యానర్లులతో ప్రచారం చేపట్టేవారు. ఇప్పుడు అక్కడక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఎక్కువగా మొబైళ్లలోనే ప్రచారం చేసుకుంటున్నారు. చిన్నా, పెద్దా, మహిళ అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ప్రతీఒక్కరి వద్ద స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. దాంతో పాటు, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్ తదితర యాప్లు ఉండటంతో ఒక ఫొటో పెట్టుకుని ఫలానా అభ్యర్థిగా, ఈవార్డు, ఈ గ్రామానికి పోటీ చేస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా గ్రామానికి ఇలాంటి సేవ చేస్తానని, మాకే ఓటు వేయాలంటూ విరివిగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏదైనా ఫ్లెక్సీలు కట్టాలన్నా, మైకుల ద్వారా ప్రచారం నిర్వహించాలన్నా వాటికి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వీటికి పెద్దగా అనుమతులు లేకపోవడంతో అభ్యర్థులే కాకుండా వారికి అనుకూలంగా ఉన్న వారు సైతం ప్రతీ గ్రూపుల్లో పోస్టులు చేస్తున్నారు. రోజువారి కార్యక్రమాలు పోస్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అలా పోటీచేసే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోనే అత్యధికంగా కనిపిస్తున్నారు.
8 నుంచి 10 గ్రూపులు
ఒక ఊరులో దాదాపు 8 నుంచి10 వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుంటూ సుమారు వెయ్యి మంది ఓటర్లు ఉండేలా చూసుకుంటూ ఆయా గ్రూపుల్లో అభ్యర్థుల ఫొటోలు, ఇప్పటికీ ఇంకా గుర్తులు రాకపోవడంతో ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని సైతం ఆ గ్రూపుల్లో చేర్చి వారికి సైతం మెసేజ్లు పంపుతున్నారు.
సోషల్ మీడియాపై నిఘా
ఒకవైపు సర్పంచ్, వార్డు మెంబర్లుగా నిలబడిన అభ్యర్థులు విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ప్రత్యేక నిఘా పెట్టారు. ముఖ్యంగా ప్రచారానికి సంబంధించినవి పెడితే ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ రెచ్చగొట్టే మెసేజ్లు గానీ, ఇతరులను నిందిస్తూ ఉన్న మెసేజ్లు గానీ, అసభ్యకరంగా ఉన్నా గానీ వారు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సోషల్ మీడియాపై ఫోకస్ చేస్తున్నారు.


