సర్పంచ్ బరిలో భార్యాభర్తలు, కుమారుడు
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పోటీ మెట్పల్లి మండలం జగ్గాసాగర్ బరిలో 12 మంది సర్పంచ్ పదవి వేలం వివాదంతో ఆ కుటుంబానికి విచిత్ర పరిస్థితి
సర్పంచ్ బరిలో రిటైర్డ్ ఐపీఎస్ భార్య
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేయాలనే ఉద్దేశంతో మాజీ ఐపీఎస్(ఎస్పీ) భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేసింది. సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన ఉప్పు తిరుపతి(రిటైర్డ్ ఐపీఎస్) భార్య లక్ష్మి గురువారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. ఉద్యోగ రిత్యా ఎక్కడ ఉన్నా సొంత గ్రామంలో అభివృద్ధి, సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసి రావడంతో బరిలో నిలిచింది. ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే సర్పంచ్ పదవికి పోటి చేస్తున్నట్లు లక్ష్మి, తిరుపతి పేర్కొన్నారు.
రాత్రివరకూ నామినేషన్లు
బుగ్గారం: మూడో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా రెండోరోజు నామినేషన్ల ప్రక్రియ మండలంలోని వెల్గొండ గ్రామంలో అర్ధరాత్రి వరకూ కొనసాగింది. మండలంలో మొత్తం నాలుగు నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వెల్గొండలో రాత్రి పదిన్నర వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. మండలంలోని 10 గ్రామాలకు సర్పంచ్ అభ్యర్థులుగా రెండో రోజు 23 మంది, 96 వార్డులకు 113 మంది నామినేషన్ వేశారు. గురువారం శుభదినం కావడం.. పైగా పౌర్ణమి కావడంతో నామినేషన్లు వేయడానికి అధిక మంది అభ్యర్థులు ఆసక్తి చూపారు. ఆశావహులు జ్యోతిష్య పండితులను సంప్రదించి తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి మూడు గంటల వరకు రాహుకాలం కావడంతో ఎక్కువ మంది మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కేంద్రానికి వచ్చారు. రాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఎంపీడీవో సుమంత్, ఎంపీవో అఫ్జల్మియా నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు.
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సర్పంచ్ బరిలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నామినేషన్లు తిరస్కరణకు గురైన పక్షంలో ఎవరోఒకరు బరిలో ఉండేందుకు ముందుచూపుగా వ్యవహరించిన ఆ కుటుంబానికి వింత పరిస్థితి ఎదురైంది. గ్రామానికి చెందిన పుల్ల సాయగౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ముందు జాగ్రత్తగా తన భార్య పుష్పలత, కుమారుడు వెంకటేశ్తో కూడా నామినేషన్ వేయించాడు. అయితే సర్పంచ్ స్థానానికి వీడీసీ వేలం వేయడం.. అది వివాదానికి దారితీయడం.. వేలం వేసిన వీడీసీ సభ్యులు పలువురిని బైండోవర్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో అధికారులు గ్రామంలో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే నిర్వహిస్తామని, నామినేషన్లు ఎవరూ విత్డ్రా చేసుకోవద్దని సూచించారు. వీడీసీ ఆంక్షలకు భయపడొద్దని చెబుతూనే.. నామినేషన్ వేసిన ప్రతిఒక్కరూ బరిలో ఉండాల్సిదేనని తేల్చిచెప్పారు. ఫలితంగా ముందు జాగ్రత్తతో మూడు నామినేషన్లు వేసిన సాయగౌడ్ కుటుంబం కూడా బరిలో నిలవాల్సి వచ్చింది. ప్రచారంలో భాగంగా ముగ్గురు కలిసే ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. భర్తను గెలిపించాలని భార్య.. తండ్రిని గెలిపించాలని కుమారుడు ఓట్లు అభ్యర్థిస్తున్న తీరును చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు.
సర్పంచ్ బరిలో 75 ఏళ్ల వృద్ధురాలు
మంథనిరూరల్: అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటూ 75 ఏళ్ల వృద్ధురాలు సర్పంచ్ బరిలో నిలబడి సమరానికి సై అంటోంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామానికి చెందిన కాసిపేట వెంకటమ్మ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉప్పట్ల పంచాయతీకి జనరల్ మహిళ రిజర్వేషన్ రాగా ఆ సామాజికవర్గం నుంచి ఎవరూ నామినేషన్ వేయకపోవడం వెంకటమ్మతో పాటు మరో ఇద్దరు పోటీలో ఉన్నారు. అయితే బరిలో నిలిచిన ముగ్గురిలో వెంకటమ్మ వృద్ధురాలు కావడం, గ్రామాభివృద్ధిలో ముందుంటానంటూ భరోసా కల్పిస్తూ తనకు సర్పంచ్గా అవకాశం కల్పించాలని ప్రచారం చేయడం హాట్ టాపిక్గా మారింది.
సర్పంచ్ బరిలో భార్యాభర్తలు, కుమారుడు
సర్పంచ్ బరిలో భార్యాభర్తలు, కుమారుడు


