
రోగాలు ఫుల్.. బెడ్లు నిల్
● ప్రభుత్వ ఆస్పత్రికి రోగుల తాకిడి ● వాతావరణ మార్పులతో వ్యాధులు ● వరండాలోనే వైద్యమందిస్తున్న వైద్యులు
జగిత్యాల: వాతావరణ మార్పులతో జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ప్రజలు వివిధ రోగాలతో ఆస్పత్రులకు తరలివస్తున్నారు. వైద్యాధికారులు డోర్ టు డోర్ సర్వే చేస్తూ.. అనుమానితులను గుర్తిస్తూ.. చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు డెంగీ ప్రభావం పెద్దగా లేనప్పటికీ టైపాయిడ్, మలేరియా ప్రబలుతున్నాయి. అయితే జిల్లాకేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో బెడ్లు లేకపోవడంతో రోగులకు వరండాలోనే చికిత్స అందిస్తున్నారు. జిల్లాకేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటుకుముందు ఓల్డ్ బస్టాండ్ ప్రాంతంలో 100 పడకల ఆస్పత్రి ఉండేది. వైద్య కళాశాల ఏర్పడటంతో ఈ ఆస్పత్రిలో 30 పడకల వరకు పెంచి ధరూర్ క్యాంప్లో రూ.17 కోట్లతో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులోనూ 200 బెడ్ల వరకు ఉన్నాయి. వైద్య కళాశాల నామ్స్ ప్రకారం 330 బెడ్లు ఏర్పాటు చేశారు. పాత బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆర్థో, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, డెంటల్, ఎమర్జెన్సీ విభాగాలు కొనసాగుతున్నాయి. మాతా శిశు సంక్షేమ కేంద్రంలో గైనకాలజీ, పిడియాట్రిక్, డెర్మటాలజీ, అస్తమాలజీ, సైకియాట్రిక్ విభాగాలు కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం ప్రజలు జ్వరాలకు సంబంధించి జనరల్ మెడిసిన్ వద్దకే వెళ్తుంటారు. ఈ విభాగం పాతబస్టాండ్లోని జనరల్ ఆస్పత్రిలో ఉండటంతో ఇక్కడనే బారులు తీరుతున్నారు. ఇక్కడ 130 పడకలు మాత్రమే ఉండటం.. దాదాపు 200కు పైగా ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. ఓపీ నిత్యం వెయ్యికి పైగా వస్తున్నారు. కొన్ని విభాగాలు మాతాశిశు సంక్షేమ కేంద్రానికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
కొన్ని ఇక్కడ... కొన్ని అక్కడ
కొన్ని విభాగాలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో.. కొన్ని ధరూర్లోని మాతాశిశు సంక్షేమ కేంద్రంలో ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. మాతాశిశు సంక్షేమ కేంద్రంలోనే ఎక్కువ బెడ్స్ ఉన్నాయి. అక్కడ జనరల్ మెడిసిన్కు సంబంధించిన కొంతమంది సిబ్బందిని పంపిస్తే ఈ కొరత తీరే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభించడంతో ఆస్పత్రిలో రోగుల తాకిడి ఎక్కువైంది. మాతాశిశు సంక్షేమ కేంద్రానికి ఓల్డ్ బస్టాండ్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో వైద్యులు కూడా వెళ్లి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఎక్కడ ఉన్నా వెళ్లాల్సి ఉంటుంది. కొందరు వెళ్లడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అన్నీ ఉన్నా...
జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 330 బెడ్ల వరకు ఉన్నప్పటికీ రెండు చోట్ల ఆస్పత్రులు ఉండటం.. కొన్ని విభాగాలు అక్కడ, కొన్ని విభాగాలు ఇక్కడ ఉండటంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. 330 బెడ్లు ఒకేచోట ఉంటే ఈ ఇబ్బందులు ఉండేవి కావు. పాత ఆస్పత్రిలో సౌకర్యాలు లేనప్పుడు కొత్త ఎంసీహెచ్కు జనరల్ మెడిసిన్కు సంబంధించిన విభాగాలను అక్కడకు తరలిస్తే బెడ్స్ సరిపోవనే సమస్య తలెత్తదు. ఓల్డ్బస్టాండ్లో ప్రభుత్వ ఆస్పత్రి ఉండటం, చుట్టు మండలాల నుంచి ప్రజలకు ఇది సౌకర్యవంతంగా ఉండటంతో ఇక్కడకే వస్తున్నారు. ఆ విభాగానికి కాకున్నప్పటికీ మరికొన్ని విభాగాలను ఇక్కడకు తరలిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
– సుమన్రావు, ఆస్పత్రి ఆర్ఎంవో
మరికొన్ని బెడ్స్ ఏర్పాటు చేస్తేనే
పాతబస్టాండ్ సమీపంలోని ఆస్పత్రిలో ప్రస్తుతం 150 బెడ్స్ మాత్రమే ఉండటం ఇబ్బందికరంగా మారింది. ఆస్పత్రిలో ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పేషెంట్లను ఉంచుతున్నారు. వెంట వచ్చిన బంధువులు ఎక్కడెక్కడో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పై ఫ్లోర్లలో అదనపు గదులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇబ్బంది లేకుండా చూస్తున్నాం
ఒకేసారి కేసులు రావడంతో ఫ్లో పెరిగింది. రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. మాతాశిశు సంక్షేమ కేంద్రంలో పిడియాట్రిక్స్ మాత్రమే చికిత్స అందిస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం సైకియాట్రిస్ట్, ఆప్తమాలజీ విభాగాలున్నాయి.

రోగాలు ఫుల్.. బెడ్లు నిల్

రోగాలు ఫుల్.. బెడ్లు నిల్

రోగాలు ఫుల్.. బెడ్లు నిల్