
న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
జగిత్యాలజోన్: కక్షిదారుల కేసులు సత్వరం పరిష్కరించి న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. పద్మావతికి జగిత్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కోర్టు బెంచ్కు న్యాయవాదులు సహకరించాలని న్యాయమూర్తి కోరారు. పెండింగ్ కేసుల సంఖ్యను వీలైనంతమేర తగ్గించేందుకు ప్రయత్నిద్దామన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ, సబ్ జడ్జి శర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ, మొదటి, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్లు జితేందర్, వినీల్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి పాల్గొన్నారు.
ఉగ్రవాదుల దాడి దురదృష్టకరం
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాల:జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడి దురదృష్టకరమని, హంతకులను ఉపేక్షించవద్దని, కఠినంగా శిక్షించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి మోతెలోని పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు. ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు జ్యోతి, గిరి నాగభూషణం, హన్మండ్లు పాల్గొన్నారు.
కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు
కథలాపూర్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయవద్దని డీఆర్డీవో రఘువరణ్ సెర్ప్ సిబ్బందికి సూచించారు. మండలంలోని దూలూర్, తాండ్య్రాల, బొమ్మెన, తక్కళ్లపెల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం సేకరించారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేశారు. తేమశాతం పరిశీలించి వెంటనే తూకం వేయించాలన్నారు. ఆయన వెంట ఏపీఎం నరహరి, సీసీలు విజయనిర్మల, రాజేందర్ ఉన్నారు.
ఒకే విద్యార్థి.. ఏడుగురు సిబ్బంది
మెట్పల్లి: పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఓపెన్ ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈనెల 20 నుంచి పరీక్షలు ప్రారంభం కాగా.. గురువారం గణితం పరీక్ష జరిగింది. ఉదయం రెగ్యులర్, మధ్యాహ్నం సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. సప్లిమెంటరీ పరీక్ష కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే రాయగా.. ఏడుగురు సిబ్బంది విధులు నిర్వర్తించారు.
మెట్పల్లి మున్సిపల్ బడ్జెట్ రూ.22.85కోట్లు
మెట్పల్లి: 2025–26 ఆర్థి సంవత్సరానికిగాను మెట్పల్లి బల్దియా రూ.22కోట్ల 85లక్షల 94వేలతో రూపొందించిన బడ్జెట్ను కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం ఆమోదించారు. ప్రారంభ నిలువ రూ.13.29లక్షలు, అంచనా ఆదాయం వివిధ గ్రాంట్స్తో కలుపుకొని రూ.22కోట్ల 72లక్షల 65వేలతో బడ్జెట్ను రూపొందించారు. ఇందులో వేతనాలకు రూ.4.65కోట్లు, శానిటేషన్ నిర్వాహణకు రూ.కోటి 29లక్షల 60వేలు, గ్రీన్ బడ్జెట్కు రూ.కోటి 3లక్షలు, కరెంట్ బిల్లులకు రూ.1.80కోట్లు కేటాయించారు.

న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచాలి

న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచాలి