Xi Jinping Warn People Who Opposed China Zero Covid Strategy - Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ ఇలాగే ఉంటది.. ఎదురుతిరిగితే తీవ్ర పరిణామాలు: జింగ్‌పిన్‌ తీవ్ర హెచ్చరికలు

May 7 2022 2:05 PM | Updated on May 7 2022 3:40 PM

Xi Jinping Warn People Who Opposed China Zero Covid Strategy - Sakshi

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. ఒక్క చైనా మాత్రమే కరోనా కట్టడికి జీరో కొవిడ్‌ పాలసీని అనుసరిస్తోంది. అయితే.. ఆ అనుసరించే విధానం మరీ ఆరాచకంగా ఉండకపోవడమే సొంత పౌరుల నుంచే వ్యతిరేకతకు కారణం అవుతోంది. లాక్‌డౌన్‌తో నరకం అనుభవిస్తున్న వాళ్లు విజ్ఞప్తులు చేస్తున్నా.. కనికరించే ప్రసక్తే లేదంటున్నాడు చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్‌.

బలవంతపు లాక్‌డౌన్‌లను చైనా ప్రజలు భరించలేకపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ.. కొద్దిపాటి కేసులకే లాక్‌డౌన్‌, అదీ కఠినంగా విధించడం, సామూహిక కరోనా టెస్టుల పేరిట భౌతిక దాడులకు పాల్పడుతుండడం, ఐసోలేషన్‌ పేరిట జంతువుల కంటే హీనంగా మనుషులతో ప్రవర్తించడం లాంటి చేష్టలపై  మండిపడుతున్నారు.  సోషల్‌ మీడియా వేదికగా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ ఆగ్రహానికి తోడు ఆహార, మందుల కొరత వాళ్లను వేధిస్తోంది. షాంగై వాసుల లాక్‌డౌన్‌ కష్టాలే అందుకు నిదర్శనం. ఈ తరుణంలో.. లాక్‌డౌన్‌ పరిణామాలపై ప్రశ్నిస్తే కఠిన శిక్షలు అమలు చేయాలని చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్‌ ఆదేశాలు జారీ చేశారు. 

గురువారం కమ్యూనిస్ట్‌ పార్టీ ‘సుప్రీం పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీ’ సమావేశం జరిగింది. తమ దేశంలో కరోనా కట్టడికి ఏ విధానాలైతే మేలు చేస్తాయో వాటిని, అవి ప్రజలను ఇబ్బంది పెట్టినా పర్వాలేదని.. అంతిమంగా  డైనమిక్‌ జీరో కొవిడ్‌ పాలసీని ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.  ఈ ఏడాది కరోనా విజృంభణ పరిస్థితులు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్‌ తొలిసారి, అదీ ఒక కీలక సమావేశంలో ప్రసంగించడం విశేషం. 

‘‘కఠిన నిర్ణయాలనేది సహజంగానే మన పార్టీతత్వం . కరోనా కట్టడికి తీసుకునే నిర్ణయాలు ప్రభావవంతంగా ఉంటున్నాయి.  వుహాన్‌లో ఏ తరహాలో కరోనాపై పోరాడి గెల్చాం.. అలాగే షాంగైలోనూ గెలిచి తీరతాం. జీరో కొవిడ్‌ పాలసీని తప్పుబట్టే వాళ్లను, పార్టీ విధానాలను వ్యతిరేకించే వాళ్లను కఠినంగా శిక్షించండి. సోషల్‌ మీడియాలో అసత్యపు ప్రచారానికి పుల్‌స్టాప్‌ పెట్టించండి’’ అని జింగ్‌పిన్‌ ప్రసంగించినట్లు సీఎన్‌ఎన్‌ ఓ కథనం ప్రచురించింది.

ఇదిలా ఉంటే.. ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి ఇప్పటిదాకా రాజధాని బీజింగ్‌లో 500కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో.. ఎక్కడ షాంగై తరహా లాక్‌డౌన్‌ అమలు చేస్తారో అని హడలి పోతున్నారు అక్కడి ప్రజలు.

చదవండి: చైనాలో కరోనా కట్టడి పేరిట వికృత చేష్టలు

Advertisement
 
Advertisement
Advertisement