చైనాతో తక్షణ ప్రమాదం వాస్తవం | US Defence Secy Hegseth Warning To Indo-Pacific allies | Sakshi
Sakshi News home page

చైనాతో తక్షణ ప్రమాదం వాస్తవం

Jun 1 2025 6:18 AM | Updated on Jun 1 2025 6:18 AM

ఇండో–పసిఫిక్‌ దేశాలు అప్రమత్తంగా ఉండాలి

అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్‌ హెచ్చరిక

సింగపూర్‌: డ్రాగన్‌ దేశం చైనా నుంచి ఇండో–పసిఫిక్‌ దేశాలకు తక్షణ ముప్పు పొంచి ఉందని, ఇది నిజమని అమెరికా విదేశాంగ మంత్రి పీటర్‌ హెగ్సెత్‌ హెచ్చరించారు. చైనా నుంచి ఎదురయ్యే సైనిక, ఆర్థికపరమైన ఒత్తిడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలోని మిత్ర దేశాలను ఒంటరిగా వదిలేయబోమని హామీ ఇచ్చారు. అదే సమయంలో, ఆయా దేశాలు రక్షణపరంగా మరింత బలోపేతం కావాలని సూచించారు.

 జీడీపీలో 5 శాతం మేర రక్షణ రంగానికి కేటాయించాలని సూచించారు. యూరప్‌ దేశాలు సైతం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చైనా నుంచి వేగంగా పెరుగుతున్న ముప్పును, ముఖ్యంగా తైవాన్‌ విషయంలో దుండుడుకు చర్యలకు ముకుతాడు వేసేందుకు అమెరికా రక్షణ చర్యలను ముమ్మరం చేస్తుందని ప్రకటించారు. తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ రిహార్సల్స్‌ చేస్తోందని హెగ్సెత్‌ వ్యాఖ్యానించారు. ఇదే లక్ష్యంతో సైన్యానికి రోజువారీ శిక్షణ అందిస్తోందన్నారు. 2027 నాటికి తైవాన్‌ను విలీనం చేసుకోవాలనే లక్ష్యాన్ని సాధించే సత్తా తమకుందని చైనా ఇప్పటికే చేసిన ప్రకటనపై ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

సింగపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సు ‘షంగ్రీ లా డైలాగ్‌’లో హెగ్సెత్‌ శనివారం కీలకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సెక్యూరిటీ స్టడీస్‌ ఏర్పాటు చేసింది. చైనా విస్తారమైన దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలను ఏర్పాటు చేసి మిలటరీ ఔట్‌ పోస్టులను నెలకొల్పుతోంది. అత్యంత అధునాతన హైపర్‌సోనిక్‌ క్షిపణులను తయారు చేయడంతోపాటు అంతరిక్షంలోనూ పైచేయి సాధించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ బెడదను దృష్టిలో ఉంచుకునే అమెరికా ‘గోల్డె న్‌ డోమ్‌’క్షిపణి రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు సిద్ధమైంది.

 పనామా కాలువ సహా లాటిన్‌ అమెరికా ప్రాంతంలోనూ పలుకుబడిని పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని హెగ్సె త్‌ ఆరోపించారు. ఈ ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా సైనిక మద్దతును పొందుతూనే చైనాతో ఆర్థికంగా సంబంధాలు నెరుపుతుండటం ప్రమాదకరమైన వ్యవహా రమని హెగ్సెత్‌ పేర్కొన్నారు. యూరప్‌ దేశాలు తమ సొంత భద్రతను చూసుకోవా లని, ఇండో–పసిఫిక్‌ బాధ్యతను అమెరికాకు వదిలేయాలన్నారు. అనంతరం మాట్లాడిన ఈయూ ఉపాధ్యక్షురాలు కాజా కల్లాస్‌ హెగ్సె త్‌ వ్యాఖ్యలను ఖండించారు. ‘ఉత్తరకొరియా బలగాలు రష్యా తరఫున ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నాయి. అదే సమయంలో, రష్యాకు చైనా మద్దతుగా నిలుస్తోంది. యూరప్, ఆసియాల భద్రత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి’అని పేర్కొన్నారు.

హాజరు కాని చైనా రక్షణ మంత్రి
ఏటా జరిగే ఈ సదస్సుకు చైనా తన రక్షణ మంత్రిని పంపిస్తుంటుంది. అమెరికాతో నడుస్తున్న టారిఫ్‌ విభేదాల నేపథ్యంలో ఈసారి దిగువ స్థాయి అధికారులతో కూడిన బృందాన్ని పంపించింది. హెగ్సెత్‌ వ్యాఖ్యలను ఈ బృందంలోని చైనా నేషనల్‌ డిఫెన్స్‌ యూనివర్సిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ హు గంగ్‌ఫెంగ్‌ తీవ్రంగా ఖండించారు. 
ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement