Turkey Coal Mine Blast: 25 Members Killed And Dozens Remain Trapped, Details Inside - Sakshi
Sakshi News home page

Turkey Mine Blast: బొగ్గు గనిలో భారీ పేలుడు.. పాతిక మందికిపైగా కార్మికుల దుర్మరణం

Oct 15 2022 8:01 AM | Updated on Oct 15 2022 9:27 AM

Turkey Mine Blast: Few Killed Dozens Trapped - Sakshi

బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మీథేన్‌ పేలుడు సంభవించడంతో.. 

అంకారా: టర్కీ ఉత్తర భాగంలో ఘోర ప్రమాదం సంభవించింది. అమస్రా వద్ద ఓ బొగ్గు గనిలో మీథేన్ పేలుడు సంభవించి పాతిక మందికి పైగా మరణించారు. డజన్ల మంది ఇంకా గనిలోనే చిక్కుకుని పోయారు. వాళ్లంతా సురక్షితంగా బయటకు రావాలని ప్రార్థనలు చేస్తున్నారు ఆ దేశ ప్రజలు. శుక్రవారం సూర్యాస్తమయం కంటే కాస్త ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. 

వందల మీటర్ల భూగర్భంలో డజన్ల మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో 110 మందికిపైగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. పేలుడు సంభవించిన వెంటనే కొందరు కార్మికులు వాళ్లంతట వాళ్లుగా బయటకు వచ్చిన దృశ్యాలు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. దాదాపు 50 మంది కార్మికులు భూమికి దిగువన 300 మరియు 350 మీటర్ల (985 నుండి 1,150 అడుగులు) మధ్య రెండు వేర్వేరు ప్రాంతాలలో చిక్కుకుని ఉంటారని రెస్క్యూ టీం అంచనా వేస్తోంది. 

ప్రమాదం జరిగిన వెంటనే  రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెఉలస్తోంది. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో ఈ ఉదయం నుంచి చర్యలు మొదలుకానున్నాయి. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని.. శనివారం ప్రమాద స్థలానికి చేరుకుంటారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

గతంలో.. 2014లో టర్కీ పశ్చిమ పట్టణం సోమాలో సంభవించిన ఎయ్‌నజ్‌ బొగ్గు గని ప్రమాదంలో 310 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement