ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడం ఖాయం
● బడుగు, బలహీన వర్గాలంతా జగనన్న వెంటే ● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం. సుభాష్ చంద్రబోస్ కర్నూలు(అర్బన్): సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం సుభాష్ చంద్రబోస్ అన్నారు. శనివారం స్థానిక బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తదితర బడుగు, బలహీన వర్గాలంతా వైఎస్ జగన్కు మద్దతుగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే తమకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆయా వర్గాల్లో గట్టి నమ్మకం ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ జగనన్న సంక్షేమ పథకాలు అందాయని, ఆయా పథకాల వల్ల లబ్ధి పొందిన వారందరూ తిరిగి ముఖ్యమంత్రిగా జగన్ను చేసుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నిరుపేద, మధ్య తరగతి వర్గాల ఆశీస్సులతో గత ఎన్నికల కంటే ప్రస్తుత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారన్నారు. చంద్రబాబునాయుడు తన మేనిఫెస్టోలో ప్రకటించిన మోసపూరిత హామీలను ప్రజలెవరు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీతో కూడిన మతోన్మాద కూటమి అభ్యర్థులకు ఓటమి తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు కూటమి ఎన్ని కుట్రలు చేసినా, ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి జూన్ 4వ తేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా కార్యదర్శి బత్తుల లక్ష్మికాంతయ్య, కే నాగేశ్వరమ్మ, చంద్రకళాబాయి తదితరులు పాల్గొన్నారు.