Restaurant Charges Tourist For Cutting Sandwich Itay - Sakshi
Sakshi News home page

శాండ్‌విచ్‌ కట్‌ చేసి, తినేలోపు ఊహించని షాక్‌.. ఈ రెస్టారెంట్‌కి వెళ్లకూడదు బాబోయ్‌!

Aug 11 2023 6:06 PM | Updated on Aug 21 2023 4:12 PM

Restaurant Charges Tourist For Cutting Sandwich Itay - Sakshi

సాధారణంగా రెస్టారెంట్‌లో తిన్నాక ఆర్డర్‌ చేసిన ఆహారం, జీఎస్టీ లాంటివి బిల్‌లో చూస్తాం. ఏ హాటల్‌కి వెళ్లినా ఇదే కనిపిస్తుంది. అయితే ఓ రెస్టారెంట్‌ మాత్రం వీటికి భిన్నంగా కస్టమర్లతో నడుచుకుంటోంది. అందులో మనం తిన్న ఆహారంతో పాటు, సర్వీసింగ్‌ మాత్రమే కాదు ప్లేట్స్‎కు కూడా బిల్ వేస్తున్నారు. ఈ వింత అనుభవాన్ని ఓ కస్టమర్ సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకోగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

రెండు పీసులకే
ఇటలీలో విహార యాత్ర ఎంజాయ్‌ చేస్తున్న ఓ బ్రిటీష్‌ టూరిస్ట్‌ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లేక్ కోమో సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్‎కు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. వెయిటర్‌ రాగానే శాండ్ విచ్‎ను ఆర్డర్ చేశాడు. అది వచ్చాక రెండు ముక్కలుగా కట్ చేసి వారిద్దరికి ఇవ్వాలని కోరాడు. తినడం పూర్తయ్యాక వెయిటర్‌ తీసుకువచ్చిన బిల్ చూసి ఆ టూరిస్ట్‌ ఒక్కసారిగా షాక్‎కు గురయ్యాడు. శాండ్ విచ్‎ను రెండు పీసులుగా చేసినందుకు కూడా బిల్‌లో చార్జీ విధించడంపై అవాక్కయ్యాడు.

శాండ్ విచ్ అసలు ఖరీదు 7.50 యూరోలు కాగా కట్ చేసినందుకు 2 యూరోలు (భారత ప్రకారం రూ.180) విధించారు. సదరు కస్టమర్‌ రెస్టారెంట్ మేనేజర్‌తో వాదించకుండా బిల్‌ చెల్లించినప్పటికీ, అతను ట్రిప్ అడ్వైజర్‌లో నెగిటివ్‌ రివ్యూస్‌ ఇవ్వడంతో పాటు ఆ బిల్లు స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు. విసుగు చెందిన కస్టమర్ రివ్యూల సైట్‌లో రెస్టారెంట్‌కు ఒక​ స్టార్‌ మాత్రమే ఇచ్చాడు. అనంతరం ఈ విషయాన్ని నెట్టింట షేర్‌ చేశాడు.

దీని చూసిన నెటిజన్లు.. ఇలాంటి రెస్టారెంట్లకు వెళ్లకూడదని, యాజమాన్యంపై మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. రెస్టారెంట్ యజామాన్యం మాత్రం తమ చర్యను సమర్థించుకుంది. దీనిపై స్పందిస్తూ.. ‘రెండు పీసులుగా చేయడం వల్ల వాటికి రెండు ప్లేట్లు వాడాలి. ఈ క్రమంలో రెండు ప్లేట్లు కడుక్కోవాలి. ఇందుకు పట్టే సమయం, శ్రమకు ఆ మాత్రం చార్జీ అవుతుంది’’ అని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement