పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం.. 17లక్షల మందిని.. | Pakistan Orders Illegal Afghans To Leave Country | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం.. 17లక్షల మందిని..

Oct 4 2023 8:42 PM | Updated on Oct 5 2023 9:06 AM

Pakistan Orders Illegal Afghans To Leave Country - Sakshi

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఉన్న అఫ్గానిస్థాన్‌కు చెందిన శరణార్థులను వెంటనే పాకిస్తాన్‌ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. లేనిపక్షంలో పాకిస్తాన్‌ నుంచి వారిని తరిమేస్తామని వార్నింగ్‌ ఇచ్చింది. అయితే, అప్ఘానిస్థాన్‌ నుంచి పాక్‌కు శరణు కోరి వచ్చిన వారి సంఖ్య దాదాలపు 17లక్షలకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. 

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ అనుమతి లేకుండా పాకిస్తాన్‌లోకి వచ్చిన వారు తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. లేదంటే తరిమివేస్తామని హెచ్చరించింది. అధికారికంగా అనుమతి పొందిన వారిని కూడా పంపించే ప్రయత్నం చేస్తోందని అక్కడి మీడియా కొన్ని కథనాల్లో పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పటికే వందల మందిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు పాక్‌లోని అఫ్గాన్‌ రాయబార కార్యాలయం తెలిపింది. 

ఇదిలా ఉండగా.. అఫ్గాన్‌ను 2021లో తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత అనేక మంది అప్ఘన్లు.. పాక్‌కు శరణార్థులుగా వచ్చారు. ఇక, ఐరాస నివేదిక ప్రకారం.. దాదాపు 13లక్షల మంది అఫ్గాన్‌ పౌరులు శరణార్థులుగా రిజిస్టర్‌ చేసుకున్నారు. మరో 8.8లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ పొందారు. మరో 17లక్షల మంది అక్రమంగా తమ దేశంలోకి చొరబడ్డారని పాక్‌ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి సర్ఫరాజ్‌ బుగిటి ఇటీవల పేర్కొన్నారు.

అక్రమంగా వచ్చినవారంతా నవంబర్‌ 1నాటికి తమ దేశం విడిచి పోవాలని ఆదేశించారు. లేదంటే భద్రతా బలగాల సహాయంతో వారిని గుర్తించి.. బలవంతంగా బహిష్కరిస్తామన్నారు. నవంబర్‌ తర్వాత పాస్‌పోర్టు లేదా వీసా లేకుండా దేశంలోకి ఎవరినీ అనుమతించమన్నారు. పాకిస్థాన్‌ పౌరులు కాకున్నా.. ఐడీ కార్డులున్న వారి జాతీయతను గుర్తించేందుకు డీఎన్‌ఏ టెస్టింగ్‌నూ ఉపయోగిస్తామని ఆయన సంచలన కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: కెనడాకు భారత్ మరోసారి హెచ్చరికలు..

Advertisement
 
Advertisement
Advertisement