ముస్తాంగ్: తీవ్ర వరదలతో ఇప్పటికే అతలాకుతలమైన నేపాల్ను తాజాగా భూకంపం కుదిపేసింది. దేశంలోని వాయువ్య ముస్తాంగ్ జిల్లాలో మంగళవారం రాత్రి 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు పొరుగు జిల్లాలైన మనాంగ్, డోల్పా, మ్యాగ్దీల్లోనూ నమోదయ్యాయి. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం అధికారిక సమాచారం ప్రకారం (భారత కాలమానం ప్రకారం) రాత్రి 9.38 గంటలకు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వాయువ్య నేపాల్లో 29.022 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83.978 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమి ఉపరితలానికి 143 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయి.
భూకంప కేంద్రం లోతుగా ఉండటంతో ఉపరితలంపై ప్రభావం పరిమితంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ నిర్మాణ నష్టం నమోదుకాలేదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వేస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం ప్రకారం, రాత్రి 9.53 గంటలకు నమోదైన ఈ భూకంపానికి ముస్తాంగ్లోని లోమంథాంగ్ కేంద్రంగా ఉంది. ఇది ఖాట్మండుకు వాయువ్యంగా సుమారు 375 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గత నెలలో భోటే కోషి నది ఆకస్మిక వరదల కారణంగా నేపాల్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ విపత్తులో 1,357 మంది మృతి చెందారు. సహాయక, గాలింపు చర్యలు 14వ రోజుకు చేరాయి. రాయిటర్స్ అంచనా ప్రకారం వరదల వల్ల ప్రత్యక్షంగా 256 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లగా, ఆర్థిక ప్రభావం, దీర్ఘకాలిక పునరుద్ధరణ వ్యయం 400 కోట్ల నుంచి 700 కోట్ల డాలర్ల వరకు పెరగవచ్చు. నేపాల్ పోలీసులు 1,366 మంది మృతిచెందినట్లు, 4,077 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని తెలిపారు. ఇప్పటివరకు 533 మంది పురుషులు, 339 మంది మహిళల మృతదేహాలను వెలికితీశారు. వీటిలో 102 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించారు.
సహాయక చర్యల్లో భారత్.. నేపాల్కు తోడ్పాటునందిస్తోంది. చిలిమే సొరంగంలో శిథిలాలు, బురదను తొలగించేందుకు భారత, నేపాల్ బృందాలు చర్యలు కొనసాగిస్తున్నాయని నేపాల్లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ తెలిపారు. వాలుగా ఉన్న సొరంగంలో రాకపోకల కోసం హెచ్డీపీఈ పైపులను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. స్యాఫ్రుబేసి నుంచి సొరంగ ద్వారం వరకు తాత్కాలిక మార్గం ఏర్పాటుకు నియంత్రిత పేలుళ్ల ద్వారా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: మోక్షం కోసం చివరి మజిలీ.. ముక్తి భవన్


