నాసా- నోకియా డీల్‌: చంద్రుడిపై మొబైల్ వాడకం

NASA Awards Nokia Contract To Set Up 4G Network On Moon - Sakshi

ఇకపై చందమామపై మొబైల్‌ ఫోన్‌ వాడొచ్చు. అది కూడా 4జీ, 5జీ నెట్‌వర్స్‌తో.. నమ్మడానికి కాస్తా అనుమానంగా ఉన్నా ఇదే నిజం. చందమామపై ఏకంగా ఫోన్ నెట్ వర్క్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చందమామపై 4G సెల్యూలర్‌ నెట్ వర్క్ అమర్చేందుకు ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో ప్రముఖ మొబైల్‌ దిగ్గజం నోకియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం నోకియాకు 14.1 మిలియన్ డాలర్ల నిధులను నాసా అందిచనుంది. టిప్పింగ్ పాయింట్ ఎంపికల కింద 370 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసింది. మొదట జాబిల్లిపై 4జీ/ఎల్నె‌టీఈ  నెట్‌వర్స్‌ను నోకియా నిర్మిస్తుంది. ఆ తర్వాత దాన్ని 5జీకి విస్తరించనుంది.  ఇది అంతరిక్ష పరిశోధన, అభివృద్ధి దిశగా కొనసాగేందుకు ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థ చంద్ర ఉపరితల సమాచార మార్పిడికి ఎక్కువ దూరం, పెరిగిన వేగంతో పాటు ప్రస్తుత ప్రమాణాల కంటే ఎక్కువ విశ్వసనీయతను అందించగలదని నాసా తన కాంటాక్ట్‌ అవార్డు ప్రకటనలో పేర్కొంది. చదవండి: బస్సు సైజు గ్రహ శకలం.. మనకు ప్రమాదమేనా?

2028 నాటికి చంద్రునిపై స్థావరం ఏర్పాటు చేసుకోవాలన్నది నాసా లక్ష్యమని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టైన్ తెలిపారు. అప్పటికి వ్యోమగాములు చంద్రునిపై నివసించడానికి, పనులు ప్రారంభించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత త్వరగా అభివృద్ధి చేయాలని అన్నారు. తాము చంద్రునిపై ఎక్కువ కాలం ఉండేందుకు విద్యుత్ వ్యవస్థలు, నివాస సామర్థ్యం అవసరమన్నారు. ఇందుకోసం నాసా నోకియా ఆఫ్ అమెరికాతో కాంట్రాక్ట్ కుదిరింది. చంద్రునిపై సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళికలు చేపట్టింది. 

నోకియా పరిశోధక విభాగం బెల్‌ ల్యాబ్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్ర రోవర్లు, నావిగేషన్ వైర్‌లెస్ ఆపరేషన్‌తో పాటు వీడియోను ప్రసారం చేయడానికి నెట్‌వర్క్‌ను తీసుకోస్తోంది. ఈ నెట్‌వర్క్ కాంపాక్ట్‌ను సమర్థవంతంగా నిర్మించారు. అలాగే అంతరిక్షంలో విపరీతమైన ఉష్ణోగ్రత, రేడియేషన్, వాక్యూమ్ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. అంతరిక్షంలో రాకెట్ ప్రొపెల్లెంట్‌ను తయారు చేయడానికి సాంకేతికత కోసం దాదాపు 370 మిలియన్‌ డాలర్ల ఖర్చు అవుతుంది. ఈ సాంకేతికను అందించే స్పేస్‌ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ వంటి అంతరిక్ష సంస్థలకు నాసా అందిస్తోంది. చంద్రునిపై కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను నిర్మిస్తే అక్కడికి వెళ్లే వ్యోమగాములు మొబైల్‌ ఫోన్‌లను వినియోగించుకోవచ్చు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top