
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తన కారణంగానే కుదిరిందంటూ.. ఆ క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేశారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ‘ఇజ్రాయెల్ - ఇరాన్ ఒకేసారి తన దగ్గరకు వచ్చి, శాంతి నెలకొల్పాలని కోరాయని పేర్కొన్నారు. ఆ క్షణంలో ఆ దేశాల ఆవశ్యకతను తాను గుర్తించానని, ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని గ్రహించానని పేర్కొన్నారు. ఈ విధమైన నిర్ణయం ఆ రెండు దేశాలకే కాకుండా, ప్రాంతీయంగా సాధించిన విజయంగా అభివర్ణించారు.
ప్రపంచ వేదికపై తనను తాను డీల్ మేకర్గా చెప్పుకుంటున్న ట్రంప్ ఈ రెండు శత్రుదేశాల మధ్య కొత్త అధ్యాయానికి గల అవకాశాలను వివరించారు. ఈ దేశాలు భవిష్యత్తులో అపారమైన పరస్పర ప్రేమ, శాంతి శ్రేయస్సును చవిచూస్తాయన్నారు. ఇజ్రాయెల్ - ఇరాన్లకు అద్భుతమైన భవిష్యత్ ఉంది. దేవుడు ఆ దేశాలను దీవించాలని కోరుకుంటూ ట్రంప్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఘర్షణలు మరింతగా పెరిగిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో కీలక పాత్ర పోషించారని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారని, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్లు ఇరానియన్ నేతలతో దౌత్య మంతనాలు నిర్వహించారన్నారు. ఇరు దేశల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం ఒక కీలక షరతుపై ఆధారపడి ఉందని సమాచారం. ఇరాన్ ఇకపై దాడులు చేయకుండా ఉంటే ఇజ్రాయెల్ తన సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తుందనేదే ఆ షరతు అని తెలుస్తోంది. ఇరాన్ తన దాడులను నియంత్రించేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలిచ్చిందని, తక్షణ దాడులకు ప్రణాళికలు లేవని అమెరికన్ అధికారి ఒకరు తెలిపారు. రెండు దేశాల మధ్య సమన్వయ సాధనలో ట్రంప్ ప్రత్యక్ష ప్రమేయంతో ఈ పురోగతి సాధ్యమయ్యిందని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ‘ఇరాన్ ఎప్పటికీ లొంగదు’: ట్రంప్ ప్రకటనపై ఖమేనీ మండిపాటు