
టెహ్రాన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడంపై ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ తప్పుడు ప్రకటన చేశారంటూ ఖమేనీ ఆరోపించారు. పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య కాల్పుల విరమణ సూచనను తిరస్కరిస్తూ, ఇరాన్ ఎప్పటికీ లొంగిపోయే దేశం కాదని ఖమేనీ స్పష్టం చేశారు.
అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఈ ఇరు దేశాలు ఘర్షణలను ఆపేందుకు అంగీకారం తెలిపాయని ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ దీనిని తిరస్కరిస్తూ, ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళిక అబద్ధమని, అమెరికాకు ఇటీవల జరిగిన అవమానం నుండి దృష్టిని మళ్లించడానికే ట్రంప్ ఈ విధమైన ప్రకటన చేశారని పేర్కొంది.
ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్ ప్రకటనపై ఘాటుగా స్పందించారు. ఇరాన్ చరిత్ర, ఇక్కడి ప్రజల గురించి తెలిసిన వారికి ఇరాన్ లొంగిపోయే దేశం కాదని స్పష్టంగా తెలుసన్నారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ట్రంప్.. ఇరాన్- ఇజ్రాయెల్ రెండూ కాల్పుల విరమణకు అంగీకరించాయని, సంఘర్షణతో నిండిన ఈ ప్రాంతంలో ఈ తాజా పరిణామం అభివృద్ధికి దారితీస్తుందని దానిలో పేర్కొన్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం శాంతియుతంగా జరుగుతుందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: సంధి దిశగా ఇరాన్? తుది నిర్ణయంపై తర్జనభర్జన